హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీలో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. బుధవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మహిళల ఫైనల్లో రంగారెడ్డి 21-25, 25-17, 25-11 తేడాతో హైదరాబాద్పై అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ను కోల్పోయినా..అద్భుతంగా పుంజుకున్న రంగారెడ్డి…వరుసగా రెండు సెట్లలో హైదరాబాద్ను చిత్తు చేసింది. ఆది నుంచి దూకుడు కనబరిచిన రంగారెడ్డి జట్టు సూపర్ సర్వీస్కు తోడు బ్లాకింగ్తో కీలక పాయింట్లు కొల్లగొట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటి టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. మరోవైపు పురుషుల ఫైనల్లో ఖమ్మం 26-24, 27-25తో మహబూబ్నగర్పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన వేర్వేరు సెమీఫైనల్ మ్యాచ్ల్లో రంగారెడ్డిపై మహబూబ్నగర్, మెదక్పై ఖమ్మం గెలిచి ఫైనల్ పోరులో నిలిచాయి. పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేశ్ తదితరులు హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన ఖమ్మం(పురుషుల), రంగారెడ్డి (మహిళల) జట్లకు లక్ష రూపాయల ప్రైజ్మనీని ఎమ్మెల్సీ కవిత అందజేశారు.