హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): గోలొండ ఆషాఢ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నది.. తద్వారా తెలంగాణ సబ్బండ వర్ణాల సంస్కృతికి పెద్దపీట వేసిందని సీఎం పేర్కొన్నారు. డప్పులు, మేళతాళాల నడుమ మహిళలు బోనమెత్తుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారని గుర్తుచేశారు.
తరతరాల తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక అస్తిత్వానికి బోనాల పండుగ ప్రతీకగా నిలిచిందని చెప్పారు. బోనాల పండుగ ప్రారంభం రోజు వాన చినుకుల రూపంలో మనందరిమీద అమ్మవారు కరుణాకటాక్షాలు కురిపిస్తుండటం శుభసూచకమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా కొనసాగుతూనే ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా, దేశవ్యాప్తంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని సీఎం కేసీఆర్ అమ్మవారిని ప్రార్థించారు.