అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గులాబ్ తుఫాను అనంతరం పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై చర్చించారు. తుఫాను అనంతరం పరిస్థితులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వివరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వర్షం తగ్గుముఖం పట్టగానే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎస్ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. బాధితులకు సహాయం చేయడంలో వెనుకడుగు వేయొద్దని చెప్పారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, మెరుగైన వైద్యం, రక్షిత మంచినీరు అందించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
విశాఖలోని ముంపు ప్రాంతాల్లో వర్షం నీటిని తొలగించాలని, ముంపు బాధిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇండ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందించాలని.. శిబిరాల నుంచి వెళ్లిపోయే సాయాన్ని ఇవ్వాలని సూచించారు. వరద ప్రాంతాల్లో పంట నష్టంపై త్వరగా అంచనాలు రూపొందించి, రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు కలెక్టర్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.