బెంగళూర్ : భారీ వర్షాలు ముంచెత్తడంతో బెంగళూర్లో రహదారులు జలమయమయ్యాయి. పోటెత్తిన వర్షంతో ఐటీ కంపెనీలకు కలిగిన నష్టం, పరిహారం వంటి అంశాలపై చర్చించేందుకు టెక్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతానని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.
ఐటీ కంపెనీలతో సమావేశమై భారీ వర్షాలతో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామని, పరిహారంతో పాటు వర్షాల కారణంగా జరిగిన ఇతర నష్టాలపై మాట్లాడతామని సీఎం వెల్లడించారు. సాధారణ రోజుల్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండే బెంగళూర్లో భారీ వర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత జటిలమయ్యాయి.
నగర శివార్లలోని టెక్ పార్క్ను కలిపే అవుటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బెల్లందూర్ ప్రాంతంలో రహదారులు నీటమునిగాయి. ఇక కర్నాటకలోని కొడగు జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. దావణగెరె, శివమొగ్గ, చిత్రదుర్గ, మైసూర్ జిల్లాలకు యల్లో అలర్ట్ జారీ చేశారు. గతవారం బెంగళూర్లోని మహదేవపుర ప్రాంతం భారీ వర్షాలతో నీట మునిగింది. ఇక వరద పోటెత్తిన ప్రాంతాల్లో ప్రజలకు సాయం అందించేందుకు అగ్నిమాపక, సహాయ, పునరావాస అధికారులు రంగంలోకి దిగారు.