భువనేశ్వర్, ఏప్రిల్ 23: సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా ఒక పరిస్థితి ఉంటే ఒడిశాలో మాత్రం విభిన్న రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అన్ని రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటే ఒడిశాలో మాత్రం స్నేహపూర్వక పోటీ నెలకొన్నది. ఇక్కడ ప్రధానంగా బిజూ జనతాదళ్(బీజేడీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పోటీ పడుతున్నాయి. ఈ రెండు పార్టీలు 2009 వరకు పదేండ్ల పాటు మిత్రపక్షాలుగా ఉండేవి. ఆ తర్వాత రెండు పార్టీలు వేరుపడ్డప్పటికీ గత పదేండ్లుగా కేంద్రంలోని మోదీ సర్కారుకు బీజేడీ అనేక అంశాల్లో, బిల్లులపై మద్దతుగా నిలుస్తూ వచ్చింది. ఈ రెండు ఫ్రెండ్లీ పార్టీల మధ్య ఒడిశాలో ప్రధాన పోటీ ఉండగా.. వీటిపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతనే ఆయుధంగా కాంగ్రెస్ బరిలో నిలుస్తున్నది. కాగా, ఒడిశాలోని 21 లోక్సభ, 147 అసెంబ్లీ స్థానాలకు మే 13, 20, 25, జూన్ 1న నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
24 ఏండ్ల నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ కొనసాగుతున్నారు. మరోసారి అధికారం దక్కించుకుంటామని ఆయన నమ్మకంగా ఉన్నారు. ఒడిశా ప్రజల్లో ఆయనకు మంచి చరిష్మా ఉంది. అయితే, ఈ ఎన్నికల్లో ఆయనకు అనేక సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. బీజేడీలో నవీన్ పట్నాయక్ తప్పించి మరో బలమైన నేత లేకపోవడం, అనేక నియోజకవర్గాల్లో పార్టీలోనే అసమ్మతి కూడా బీజేడీకి మైనస్గా కనిపిస్తున్నది.
బీజేడీతో స్నేహంగా ఉంటూనే ఒడిశాలో విస్తరించింది బీజేపీ. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కమలం పార్టీ కొనసాగుతున్నది. 2014 ఎన్నికల్లో 21 లోక్సభ స్థానాలకు కేవలం ఒక్క స్థానానికి పరిమితమైన కమలం పార్టీ 2019 నాటికి ఎనిమిది స్థానాలకు ఎగబాకింది. ఈసారి మెజారిటీ లోక్సభ స్థానాలతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. నరేంద్ర మోదీ చరిష్మా, హిందుత్వ నినాదం, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి అంశాలు తమకు కలిసొస్తాయని బీజేపీ భావిస్తున్నది. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 38.4 శాతం ఓట్లతో ఎనిమిది స్థానాలు సాధించినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 32 శాతం ఓట్లతో 23 సీట్లకే పరిమితమైంది.
ఒకప్పుడు ఒడిశాలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. 2014లో 26 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ 2019 నాటికి 13 శాతానికి పరిమితమైంది. ఇప్పుడు కనీసం రెండో స్థానానికైనా రావాలని భావిస్తున్నది.
ఒడిశాలో బీజేడీ – బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నదని సర్వేలు అంచనా వేస్తున్నాయి. దాదాపుగా అన్ని సర్వేలు కూడా ఈ రెండు పార్టీలు అటుఇటుగా చెరో 40 శాతం ఓట్లు, 10 – 12 సీట్లు గెలుస్తాయని అంచనా వేశాయి.