న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: మొత్తం ముస్లిం సామాజిక వర్గాన్ని వెనుకబడిన కులంగా గుర్తించాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్(ఎన్సీబీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం సామాజిక న్యాయ సూత్రాలను బలహీనపరచడమేనని వ్యాఖ్యానించింది. కర్ణాటక వెనకబడిన సంక్షేమ తరగతుల విభాగం సమర్పించిన డాటా ప్రకారం ముస్లిం మతంలోని అన్ని కులాలు, వర్గాలను సామాజికంగా, విద్యా పరంగా వెనకబడిన తరగతులుగా గుర్తించి IIబి విభాగంలో చేర్చారు.
గతేడాది ఎన్సీబీసీ కర్ణాటకలో పర్యటించినప్పుడు ఓబీసీలకు విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం రూపొందించిన రిజర్వేషన్ల విధానాన్ని పరిశీలించింది. ముస్లిం మతంలోని వర్గాలన్నింటినీ బీసీలుగా గుర్తించడం వల్ల ఆ మతంలో అత్యంత వెనకబడిన వర్గాలను బలహీనపరిచినట్టే అవుతుందని తెలిపింది. ఇలాంటి రిజర్వేషన్లు సామాజిక న్యాయాన్ని మొత్తంగా ప్రభావితం చేస్తాయని.. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్ణాటక జనాభాలో 12.92 శాతం ముస్లింలున్నారు.