కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శుక్రవారం హింస చోటుచేసుకున్నది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ఓ మసీదు వద్ద రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొన్నది. మొహమ్మద్ ప్రవక్తపై ఇటీవల బీజేపీ ప్రతినిధి ఒకరు ఓ టీవీ చర్చలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ షాపులను మూసివేయాలని కాన్పూర్లో శుక్రవారం బంద్ పాటించారు. ఆ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది.
రాళ్లు రువ్వుకున్న ఘటనకు చెందిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోల ఆధారంగా పోలీసులు 36 మందిని అరెస్టు చేశారు. గుర్తు తెలియనివారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరింత మందిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసు కమీషనర్ విజయ్ సింగ్ మీనా తెలిపారు. గ్యాంగ్స్టర్ యాక్ట్ ప్రకారం కుట్రదారులపై చర్యలు తీసుకోనున్నారు. హింసకు పాల్పడిన వాళ్ల ప్రాపర్టీని సీజ్ చేయనున్నారు.
నుపుర్ శర్మ వ్యాఖ్యలు
బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపి మసీదు ఘటనపై ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ ఆయన ప్రవక్త గురించి కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ కాన్పూర్లో మార్కెట్లను బంద్ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత అకస్మాత్తుగా వంద మంది యువకులు వీధుల్లోకి వెళ్లి నినాదాలు చేశారు. అక్కడ ఉన్న మరో గ్రూపు వారిని అడ్డుకున్నది. దీంతో రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కొంత మంది పోలీసులు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేసినా గొడవ సద్దుమణగలేదు. 10 నిమిషాల వ్యవధిలోనే అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. కానీ ఈ లోపు భారీ నష్టం జరిగింది.