రవీంద్రభారతి, నవంబర్ 4: ఘంటసాల సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు, గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ పేర్కొన్నారు. ఘంటసాల శతజయంతి వేడుకలు సాంస్కృతిక సంస్థ సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారాన్ని మధుర గాయని పి. సుశీలకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మంత్రి శ్రీనివాస్గౌడ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా.కె.ఐ వరప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాట్లాడుతూ ఘంటసాల వెంకటేశ్వరావు భారతదేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొని 6 నెలలు జైలు శిక్ష అనుభవించి, జైలులోనే దేశభక్తిగీతం పాడిన గొప్ప మహనీయుడన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయనను తెలుగుజాతి మరువదని కొనియాడారు. ఘంటసాల కడు పేదరికం నుంచి ప్రపంచం గర్వించదగ్గ గొప్ప గాయకుడయ్యారని, అలాంటి మహనీయుడి శతజయంతి ఉత్సవాలకు రావడం తన పూర్వ జన్మసుకృతమన్నారు. తాను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రవీంద్రభారతిలో ఘంటసాల గాన సుస్వరాలను విని ఎంతో ఆనందించానని, ఈ వేదికపై ఎందరో మహానుభావులను చూశానన్నారు. ఘంటసాల, సినారె, ఎన్టీఆర్, ఏఎన్నార్లు ఈ వేదికపైనే అనేక కార్యక్రమాలు చేశారని, అలాంటి మహనీయులు పుట్టిన తెలుగు గడ్డపై జన్మించడం మన తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఘంటసాల గొప్ప మానవతావాది.. అనేక మంది పేద కళాకారులను ప్రోత్సహించి గాయకులుగా నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయనకు పేదలంటే ఎంతో ప్రేమ అన్నారు.
ఆయన ప్రతినిత్యం పేదలకు అన్నదానం చేసేవారన్నారు. తెలుగు రాష్ర్టాల ప్రజలు తెలుగు భాషను విస్మరించరాదని, తమ పిల్లలకు తెలుగుభాష, సంగీతం, సాహిత్యం, పద్యాలను నేర్పించాలని ఆయన సూచించారు. తెలుగు ప్రభుత్వాలు తెలుగు భాషకు అనుకున్నంత మద్దతు ఇవ్వడంలేదని ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సినీరంగంలో కూడా తెలుగు భాషను కాని, గొప్పతనాన్ని చూపించడం లేదన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఇంట్లో తెలుగు భాషను మాట్లాడించాలని, తెలుగు పాటలను వినిపించాలని ఆయన సూచించారు. సినిమా హీరోలు మంచి చిత్రాలు తీయాలని, తెలుగుభాషను కాపాడాలని సినీ రంగానికి ఎన్వీ రమణ సూచన చేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరావు. ఆయన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. అలాంటి మహనీయుని శతజయంతి ఉత్సవాలు రవీంద్రభారతిలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఘంటసాల ఒక మతానికి, కులానికి, ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికాదు.
దేశం గర్వించదగ్గ గొప్ప గాన గంధర్వుడు. రెండు రాష్ర్టాలు వేరైనా మన భాష ఒక్కటే, మన సంస్కృతి, సంప్రదాయాలు ఒక్కటే. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సాహితీవేత్త..ఆయనకు కళాకారులు, కళలంటే ఎంతో ఇష్టం. ఘంటసాల జయంతి ఉత్సవాలను ప్రతిఏటా ఘనంగా నిర్వహిస్తాం’ అన్నారు. ఆనంతరం ప్రఖ్యాత నేపథ్య గాయకురాలు పి. సుశీలకు ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్, సీనియర్ నటి కృష్ణవేణి, ఘంటసాల శతజయంతి సత్కారగ్రహీత కృష్ణవేణి, డా.పి.ఎస్ గోపాలకృష్ణ, ఎస్.కోటేశ్వరరావు, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ పాల్గొన్నారు. అనంతరం వందమంది పిల్లలతో ఘంటసాల పాటల కచేరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగమం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్కిషోర్ పాల్గొన్నారు.