న్యూఢిల్లీ, జనవరి 4: పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఓ స్వేచ్ఛా జీవి అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. రిటైరయ్యాకే జడ్జిలకు తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా, స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశం కలుగుతుందన్నారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి వీడ్కోలు సమావేశంలో ఈ మేరకు వర్చువల్గా మాట్లాడారు. సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజల హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వందకు పైగా కీలక తీర్పులను జస్టిస్ సుభాష్ రెడ్డి వెలువరించారని గుర్తు చేశారు. న్యాయస్థానాల్లో కేసులు అంతకంతకూ పోగుపడిపోతున్నాయని జస్టిస్ సుభాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాలు, మౌలిక వసతులు లేకపోవడం దీనికి కారణంగా చెప్పారు. తెలంగాణ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన తొలి జడ్జిగా జస్టిస్ ఆర్ సుభాష్రెడ్డి రికార్డు సృష్టించారు. 2018 నవంబర్ 2న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం పదవీ విరమణ చేశారు. దీంతో అత్యున్నత ధర్మాసనంలో జడ్జిల సంఖ్య 32కు తగ్గింది.
వ్యవసాయ కుటుంబం నుంచి..
ఉమ్మడి మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం కమారం గ్రామంలో 1957లో వ్యవసాయ కుటుంబంలో జస్టిస్ సుభాష్ రెడ్డి జన్మించారు. 1980 అక్టోబర్ 30న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2002 డిసెంబర్ 2న ఏపీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2004లో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం తెలంగాణ హైకోర్టు జడ్జిగానూ పనిచేశారు. 2016 ఫిబ్రవరి 13న గుజరాత్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2018 నవంబర్ 2న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.