వాషింగ్టన్ డీసీ: భాషను, సంస్కృతిని, కన్నతల్లిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు. మన భాష, సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఒక పెద్దబాలశిక్ష పుస్తకం ఉండాలని, శతక సాహిత్యాలను డౌన్లోడ్ చేసుకుని పిల్లలతో పద్యాలు చదివించాలన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఎన్ఆర్ఐలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాతృభూమిని, సొంత మనుషులను వదులుకుని ఇక్కడ ఉంటున్నారని చెప్పారు. అవకాశం ఉన్నప్పుడు మాతృభూమిని సందర్శించాలన్నారు. సాంస్కృతిక సంస్థల ప్రోత్సాహానికి కృషిచేయాలని ఎన్ఆర్ఐలకు సూచించారు.
ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడాలని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు తన బంగ్లాలో నేమ్ప్లేట్ హిందీ, ఇంగ్లిష్లో పెట్టారని, అయితే తెలుగులోనే కావాలని పట్టుబట్టి తెలుగులో పెట్టించానని చెప్పారు. తన మాతృభాష విషయంలో రాజీపడనని గట్టిగా చెప్పానని వెల్లడించారు. ఇంగ్లిష్తోపాటు తెలుగు నేర్పించాల్సిన అవసరం తప్పనిసరని పేర్కొన్నారు. పిల్లలు తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు మాట్లాడుతారని, అప్పుడు ఉచ్ఛారణ సరిదిద్దాలికానీ కోపగించుకోవద్దని సూచించారు.