సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శనివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొన్నారు. జస్టిస్ రమణకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కేఎస్ జవహర్రెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. తీర్థ, ప్రసాదాలు అందజేశారు. అనంతరం అలిపిరిలోని సప్త గోప్రదక్షిణశాలను సందర్శించి, వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి తిరుమల వెళ్లారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
– తిరుమల, నమస్తే తెలంగాణ