వరంగల్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తున్నదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. కేంద్రప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా సొంత నిధులతో రాష్ట్రప్రభుత్వం కోర్టు భవనాలను నిర్మిస్తున్నదని కొనియాడారు. వరంగల్లో రూ.10 కోట్ల రాష్ట్రప్రభుత్వ నిధులతో నిర్మించిన కొత్త కోర్టు భవనాల సముదాయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మతో కలిసి జస్టిస్ రమణ ఆదివారం ప్రారంభించారు. అనంతరం కోర్టు ఆవరణలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రప్రభుత్వం ఇచ్చే నిధులకు తమ వాటాగా ఇవ్వాల్సిన నిధులను చాలా రాష్ర్టాలు ఇవ్వటం లేదు. తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరేగా ఉన్నది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్రప్రభుత్వం సొంత నిధులతో కోర్టు భవనాల నిర్మాణంతోపాటు వసతులు కల్పిస్తున్నది. ఇదే తెలంగాణ గొప్పతనం’ అని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు గొప్ప మద్దతిస్తున్నదంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్రంలో న్యాయవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నదని ప్రశంసించారు.
వసతులు లేకుండా న్యాయమెలా?
కోర్టుల్లో మౌలిక వసతులు సరిగా ఉంటేనే సకాలంలో కేసుల పరిష్కారం సాధ్యమవుతుందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. వసతులు లేకుండా కోర్టు భవనాల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు పనిచేయాలనుకోవడం దురాశే అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన కోసం ‘ఇండియన్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటివరకు సరైన స్పందన రాలేదని తెలిపారు. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే దీనిపై ప్రత్యేక చట్టం చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. వరంగల్ కొత్త కోర్టుల సముదాయాన్ని అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు. ఇది తన ఆలోచనలు, భావాలకు అనుగుణంగా, కళలకు ప్రతిరూపంగా ఉన్నదని పేర్కొన్నారు. కోర్టు భవనాల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన జస్టిస్ నవీన్రావును అభినందించారు. విచారణ సందర్భంగా సాక్షులను నిందితులు చూడలేకుండా పోక్సో కోర్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దటంపై ప్రశంసలు కురిపించారు. వరంగల్ కోర్టు భవనంపై సమగ్రంగా పుస్తకం, వీడియో తీసి పంపితే దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు పంపి మోడల్గా తీసుకోవాలని సూచిస్తానని చెప్పారు.
అన్ని కోర్టుల్లో వసతులు పెరగాలి
వరంగల్ కోర్టుల తరహాలోనే ఇతర కోర్టుల్లో కూడా వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ అన్నారు. అన్ని వసతులు ఉన్న కోర్టుల్లో విచారణ ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. మంచి వసతులు ఉన్న కార్యాలయంలో పనిచేయడం వల్ల న్యాయమూర్తులు, అధికారులు, న్యాయవాదుల పనితీరు మెరుగుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డి, జస్టిస్ పీ నవీన్రావు, వరంగల్ కోర్టుల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి నందికొండ నర్సింగరావు, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేపీ ఈశ్వరనాథ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, న్యాయవాదులు పాల్గొన్నారు.
వేదిక దిగి సన్మానం
కోర్టుల కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఓ సీనియర్ న్యాయవాదిని సీజేఐ వేదిక దిగివచ్చి సన్మానించటం విశేషం. జిల్లాలోని ఏడుగురు సీనియర్ న్యాయవాదులను సీజేఐ చేతులమీదుగా సన్మానించాలని జిల్లా న్యాయస్థానం ఉన్నతాధికారులు ముందుగా నిర్ణయించారు. వీరిలో వరంగల్ కోర్టులో మొదటి మహిళా న్యాయవాది అయిన జయ హరిహరరావు (76) కూడా ఉన్నారు. ఆమె వయోభారంతో వేదికపైకి వెళ్లలేకపోవటంతో జస్టిస్ ఎన్వీ రమణ వేదిక దిగి వచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా వర్చువల్ పద్ధతిలో అన్నపూర్ణ క్యాంటీన్, జస్ట్ ఈజ్ వెబ్సైట్, రికార్డు వెబ్సైట్లను ప్రారంభించారు.
భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో పూజలు
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే సతీశ్చంద్ర శర్మ కుటుంబాలు వరంగల్లోని ప్రఖ్యాత భద్రకాళి, వేయి స్తంభాల ఆలయాల్లో ఆదివారం పూజలు నిర్వహించాయి. పురోహితులు వారికి పూర్ణకుంభాలతో స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలు, లడ్డు ప్రసాదాలు, దేవతామూర్తుల చిత్రపటాలను బహూకరించారు. ఆలయాల చరిత్ర, విశిష్టతలను వివరించారు. న్యాయమూర్తుల వెంట వరంగల్ కోర్టుల ప్రిన్సిపల్ జడ్జి నందికొండ నర్సింగరావు, హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఉన్నారు.
ఆదివారం వరంగల్ భద్రకాళీ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్రశర్మ దంపుతులు.