హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్నీ సంచులు కూడా సమకూర్చలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. దేశంలో తెలంగాణ మినహా ఏ రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ ఏడాది (2021-22) ధాన్యం కొనుగోళ్లకు 14 కోట్ల గన్నీ సంచులు అడిగితే కేంద్రం కేవలం 6.4 కోట్ల సంచులే సరఫరా చేసిందని తెలిపారు. సంచుల సేకరణ కోసం కేంద్రం ఒకో సంచికి రూ.7.32 మాత్రమే చెల్లిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 30.25కు కొనుగోలు చేసిందన్నారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం కేవలం 2 నెలల వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నదని, రాష్ట్రం 10నెలల వడ్డీ భారాన్ని భరిస్తున్నదని తెలిపారు. డిమాండ్కు తగ్గ స్టోరేజ్ స్పేస్ కూడా చూపించడంలేదని అన్నారు. దీంతో సీఎంఆర్ అప్పగించడంలో జాప్యం ఏర్పడి వడ్డీ భారం పెరుగుతున్నదని తెలిపారు. బియ్యం స్టోరేజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 8 నెలల స్టోరేజ్ చార్జీలను భరిస్తే.. కేంద్రం కేవలం 2 నెలలకు మాత్రమే చెల్లిస్తున్నదని తెలిపారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా సీఎంఆర్ గడువును పెంచకపోగా తగ్గిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం వైఖరితో ధాన్యం కొనుగోలు రాష్ర్టాలకు ఆర్థిక భారంగా మారుతున్నది పేర్కొన్నారు.