ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఆకట్టుకున్న క్రీస్తు నాటకం
మాదాపూర్, డిసెంబర్ 25: కల్వరి టెంపుల్ భక్తజన సందోహంతో శనివారం కిటకిటలాడింది. ఆసియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన కల్వరి టెంపుల్లో శనివారం క్రిస్మస్ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి విచ్చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో కల్వరిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరై మిరుమిట్లు గొలిపే దీపకాంతుల నడుమ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ బహుమతులను అందజేసుకుంటూ సంతోషాల నడుమ పండగను జరుపుకున్నారు.
ఇందులో భాగంగా కల్వరి నిర్వాహకులు మొత్తం నాలుగు ఆరాధన మహోత్సవాలను నిర్వహించగా, ఒక్కో సర్వీస్కు దాదాపు 50 వేల నుంచి 60 వేల వరకు భక్తులు విచ్చేయగా, మొత్తం 3 లక్షలకు పైగా భక్తులు, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో కల్వరి నిర్వాహకులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు, డాక్టర్ సతీష్ కుమార్ క్రీస్తు సందేశాన్ని భక్తులకు తెలియజేస్తూ క్రీస్తు జన్మ రహాస్యాన్ని అద్భుతంగా వివరించాడు.