జనరంజకమైన నృత్యభంగిమల రూపకర్తగా దక్షిణాది చిత్రసీమపై తనదైన ముద్రను వేసిన ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్ మాస్టర్ (72) ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొద్ది రోజుల కిందట కరోనా బారిన పడిన ఆయనకు ఆదివారం నెగెటివ్ అని తేలినా ఫలితం లేకుండా పోయింది. శాస్త్రీయ నృత్యరీతుల్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ప్రతిభావంతుడిగా శివశంకర్ మాస్టర్ పేరుసంపాదించుకున్నారు. పాటలోని భావాన్ని ప్రతిబింబిస్తూ నృత్యాల్ని తీర్చిదిద్దడం, మాస్ స్టెప్పులతో ప్రేక్షకుల్ని హుషారెత్తించడం ఆయన కొరియోగ్రఫీలో విలక్షణతగా చెబుతారు. తెలుగు, తమిళంతో సహా పది భారతీయ భాషల్లో 800లకుపైగా సినిమాలకు శివశంకర్ మాస్టర్ నృత్యరీతుల్ని సమకూర్చారు.
ఇటీవల కరోనా బారిన పడిన శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో మూడు రోజులుగా వెంటిలేటర్పై ఉంచారు. ఆదివారం నెగెటివ్ వచ్చినా సాయంత్రం ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. శివశంకర్ మాస్టర్ పెద్ద కొడుకు విజయ్ సైతం కరోనాతో పోరాడుతున్నాడు. శివశంకర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు. కల్యాణ సుందర్, కోమల అమ్మాళ్ ఆయన తల్లిదండ్రులు. తండ్రి కల్యాణసుందర్కు కర్ణాటక సంగీతం, జ్యోతిషంలో మంచి ప్రావీణ్యం ఉండటంతో శివశంకర్కు చిన్నతనంలోనే నృత్యంపై మక్కువ ఏర్పడింది. రెండేళ్ల వయసులో ఓ ప్రమాదం కారణంగా శివశంకర్ వెన్నెముకకు గాయమైంది. కోలుకోవడానికి ఎనిమిదేళ్లు పట్టింది. దాంతో ఇంటిదగ్గరే ఉండి ప్రాథమిక విద్యను అభ్యసించారు. చెన్నైలోని నటరాజశకుంతల అనే డ్యాన్స్ మాస్టర్ వద్ద నృత్యం నేర్చుకున్నారు. సహాయ నృత్య దర్శకుడిగా సినీరంగంలోకి ప్రవేశించి నాటి ప్రముఖ కొరియోగ్రాఫర్ సలీమ్ దగ్గర శిష్యరికం చేశారు. తమిళ చిత్రం ‘కురివికూడు’ (1980) ద్వారా నృత్య దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించారు.
‘ఖైదీ’తో తెలుగులో అరంగేట్రం
చిరంజీవి కథానాయకుడిగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఖైదీ’ సినిమాతో నృత్యదర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు శివశంకర్మాస్టర్. గురువు సలీమ్మాస్టర్ బిజీగా ఉండటంతో ఈ సినిమాలోని ‘రగులుతుంది మొగలిపొద’ అనే పాటకు నృత్యాన్ని సమకూర్చే అవకాశం శివశంకర్కు దక్కింది. తొలి పాటతోనే ఆయన పాపులర్ అయ్యారు. ఇందులో ‘గోరింటా పూసింది’, ‘వేదం మోదం..’ పాటలకు ఆయన విలక్షణ రీతిలో నృత్యాల్ని అందించి ప్రతిభను చాటుకున్నారు. అడవిరాముడు, చక్రవ్యూహం, అమ్మోరు, సూర్యవంశం, తిరుడా తిరుడి, అల్లరి పిడుగు, వరలాలు, అరుంధతి, మహాత్మ, వరుడు, యమదొంగ, మర్యాదరామన్న సినిమాల్లో ఆయన సమకూర్చిన నృత్యాలకు మంచి పేరువచ్చింది.
‘మగధీర’కు జాతీయ అవార్డు..
రాజమౌళి దర్శకత్వంలో రామ్చరణ్ నటించిన ‘మగధీర’ చిత్రంలోని ‘ధీర ధీర’ పాటకు అద్భుత రీతిలో నృత్యాన్ని సమకూర్చినందుకు గాను శివశంకర్ ఉత్తమ కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డును (2010)లో అందుకున్నారు. ఈ పాట కోసం 22రోజుల సమయం తీసుకున్నానని శివశంకర్ చెప్పేవారు .‘అరుంధతి’ చిత్రంలో శాస్త్రీయ నృత్య ప్రధానంగా సాగే ‘భు భు భుజంగం’ అనే పాట కూడా శివశంకర్కు మంచి గుర్తింపుతీసుకొచ్చింది. తమిళ చిత్రం ‘తిరుడా తిరుడి’ (తెలుగులో ‘దొంగా దొంగది’)లో ఆయన కంపోజ్ చేసిన ‘మన్మథ రాజా..’ పాట నాడు యువతరాన్ని ఉర్రూతలూగించింది. హుషారైన డ్యాన్స్స్టెప్స్తో చాలా పేరుపొందింది.
నటుడిగా కూడా గుర్తింపు
నృత్యదర్శకుడిగానే కాకుండా నటుడిగా రాణించారు శివశంకర్ మాస్టర్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ముప్పైకిపైగా సినిమాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. అరాణ్మనై, శివలింగ, నేనే రాజు నేనే మంత్రి, అక్షర, నిను వీడని నీడను నేను, రాజుగారి గది-3 చిత్రాలు ఆయనకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. నృత్యప్రధానమైన ఆట జూనియర్స్, ఢీ వంటి రియాలిటీ షోస్కు జడ్జిగా వ్యవహరించారు.
పది భాషల్లో ప్రస్థానం..
దక్షిణాదితో పాటు హిందీ, ఒరియా, మరాఠీ, తుళు, బెంగాలీ, జపనీస్తో పాటు పది భాషల్లో నృత్యదర్శకుడిగా పనిచేశారు. శివశంకర్కు భార్య సుగణ్యతో పాటు కుమారులు విజయ్శివశంకర్, అజయ్శివశంకర్ ఉన్నారు. కుమారులిద్దరూ తండ్రి బాటలోనే నృత్యదర్శకత్వంవైపు అడుగులు వేశారు. శివశంకర్ మాస్టర్ కరోనాతో ఆసుపత్రిలో చేరినా ఆయన చనిపోయేముందు కొవిడ్ నెగెటివ్గా వైద్యులు నిర్ధారించారు. సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో శివశంకర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శివశంకర్ మాస్టర్ మరణవార్త నన్ను కలిచివేసింది. ఆయన, నేను ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశాం. ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్లు అనిపిస్తున్నది. శివశంకర్ మాస్టర్ మృతి కేవలం నృత్యకళారంగానికే కాదు యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటు
-చిరంజీవి