హైదరాబాద్ , మే 24: కర్ణాటకలో సోమవారం “చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్” కర్ణాటకలో ప్రారంభమైంది. కర్ణాటక – చింతామణిలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’ప్రారంభించడం జరిగింది. కాగా చింతామణి లో ఆక్సిజన్ బ్యాంకు ను ఏర్పాటుచేసిన తన అభిమానికి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అభినందనలు తెలియజేశారు.
కరోనావిపత్కర పరిస్థితుల్లో సకాలంలో ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోకూడదు అనే ఉద్దేశంతో టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలోని ప్రతీ జిల్లాలోనూ ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్ స్టేట్మెంట్ను విడుదల చేసింది కూడా. మరికొన్ని రోజుల్లో ప్రజలకు ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.