సనాతన భారతీయ సంస్కృతిలో దీపానికి చాలా విశిష్టత ఉంది. ఏ దైవ కార్యమైనా దీపారాధన చేసిన తర్వాతే మొదలవుతుంది. పూజాదికాల్లో ‘దీప దర్శనం’ ఒక ఉపచారంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ, దీపం మన సంస్కృతికి వెలుగు చిహ్నం. దీపాలు వెలిగించడం, దీపాన్ని దానం ఇవ్వడం సనాతన సంప్రదాయంలో భాగం. దీపాన్ని వెలిగిస్తే అంధకారమే కాదు దుష్టశక్తులూ దూరమవుతాయని నమ్మకం.
దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే॥
వెలుగులు పంచే దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా చెప్తారు. గోరంత దీపం, కొండంత వెలుగునిస్తే, దీపాల వరుసల దీపావళి మానవ జీవితాల్లో అనంత ప్రకాశాన్ని నింపుతుంది. చైతన్యానికి ప్రతీక దీపం, చీకట్లో ఒక చిన్న దీపం వెలిగిస్తే ఎంతో ధైర్యం, ఉత్సాహం కలుగుతాయి. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని ప్రసాదించేదే దీపలక్ష్మి. నిత్యం దీపారాధన జరిగే ఇంట్లో సంపద, శాంతి, యశస్సు, అదృష్టాలు వెల్లివిరుస్తాయని పురాణాలు చెప్తున్నాయి.
‘దీపంతో దేనినైనా సాధించవచ్చు’ అని ఆర్షవాక్కు. అందుకే ఉదయం, సాయం వేళల్లో దీపాన్ని వెలిగిస్తే సకల ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. ఒక దీపాన్ని వెలిగించి- ఏదైనా ఫలాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ప్రారంభించిన పనులు సజావుగా సాగుతాయని విశ్వసిస్తారు. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అని సామెత. అంటే సంపద ఉన్నప్పుడే అన్నింటినీ సమకూర్చుకోవాలని దీని అంతరార్థం.
వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే
ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్
ఇక్కడ ప్రమిద.. ప్రబోధం.. తైలం.. వైరాగ్యం. ఇందులో భక్తి అనే వత్తిని వెలిగించాలి. ఫలితంగా జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. ఈ భావంతో దీపాన్ని దర్శించారు మన పూర్వీకులు. జ్ఞానజ్యోతి వెలిగినప్పుడు పరంజ్యోతి అనుగ్రహం లభిస్తుంది. ‘పరమాత్మే పరంజ్యోతి’. ఈ జ్ఞానం పరమాత్మ దర్శనానికి దారి చూపుతుంది. అందుకే, సాధన క్రమంలో వెలుగుతున్న దీపశిఖపై దృష్టిని కేంద్రీకరించమని సూచించారు పెద్దలు. దీపంపై దృష్టి నిలిచే కొద్దీ ఏకాగ్రత నిలుస్తుంది. సాధన ముందుకుసాగుతుంది. అన్వేషణ పెరుగుతుంది. అంతిమంగా జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానజ్యోతి ప్రకాశించిన సాధకుడు ప్రతి ప్రాణిలోనూ పరంజ్యోతిని చూడగలుగుతాడు. దీపం వెలుగులో చుట్టూ ఉన్న వస్తువులు ప్రస్ఫుటంగా కనిపించినట్టు, జ్ఞానం పొందిన వ్యక్తి ఈ లోకాన్ని సమదృష్టితో చూడగలుగుతాడు.
దీపావళి నాడు దీపాలను వెలిగించి, భక్తిగా నమస్కరించడమే ‘దీపయజ్ఞం’. దేవుడి ముందు, గుమ్మాల దగ్గర, తులసిమొక్క దగ్గర దీపాలను వెలిగించడం వల్ల ఇంటికి కొత్త కళ వస్తుంది. ఈ దీపాలు అమంగళాన్ని తొలిగిస్తాయి. దారిద్య్రాన్ని నివారిస్తాయి. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తిష్ఠ వేస్తుంది. రుణాత్మక శక్తి నెలకొని ఉంటుంది. వీటిని నివారించే ఉపాయం దీపారాధన. సూర్యచంద్రాగ్నులు సమ్మిళితమై ఉన్న దీపాన్ని వెలిగించినప్పుడు దేవతల అనుగ్రహం లభిస్తుంది. దీపావళి దీపా లు ఈ లోకంలో వెలుగులు పంచడమే కాదు, ఊర్ధ లోకంలోని పితృ దేవతలకు దారిచూపుతాయని విశ్వా సం. దీపం వెలిగించడం వల్ల సామాజిక ప్రయోజనాలూ ఉన్నాయి. ఆవు నెయ్యితో వెలిగించే దీపం నుంచి వచ్చే ధూపం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్తారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్న వేదవాక్కు చీకటి నుంచి వెలుగులోకి రమ్మని చెప్తుంది. ఈ దీపావళి వేళ దురాలోచనలనే చీకట్లను చీల్చుకొని సద్గుణాలను ప్రోది చేసుకుందాం. దీపలక్ష్మిని ఆరాధించి అష్టలక్షుల అనుగ్రహాన్ని పొందుదాం.
ఆదరాసుపల్లి వంశీధర్
94908 66608