సృష్టికర్త పరమేశ్వరుడు. అతనికి ప్రపంచమే సంపద. అనంత శక్తిశాలి కాబట్టి మనకు అద్భుతమైన ప్రపంచాన్ని రచించి ఇచ్చాడు. అంతేకాదు, అన్ని ప్రాణుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు చూసేవాడు పరమేశ్వరుడే. మనకు వేదం ద్వారా లోకహిత కర్మలను తెలియజేసిన పరమేశ్వరుడే నిజమైన బంధువు.‘సనో బంధుర్జనితా సవిధాతా
ధామాని వేద భువనాని విశ్వా॥’ (యజుర్వేదం)
సృష్టికర్త కంటే బంధువు ఎవరుంటారు? అతనే మన ఆలన పాలన చూసుకునేవాడు. తైత్తిరీయ ఉపనిషత్తులో ‘యోగక్షేమాల’ ప్రస్తావన ఉంది. సంపాదించిన దాన్ని ‘యోగం’ అని, రక్షించుకోవడాన్ని ‘క్షేమం’ అని అంటారు. మన యోగక్షేమాలను చూసేవాడు పరమేశ్వరుడే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేశాడు.
‘అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్’
(భగవద్గీత 9-22)
ఆత్మజ్ఞానం కలిగినవారు ఇతర విషయాలను పట్టించుకోక, కేవలం పరమాత్మయందే తమ మనసును లగ్నం చేస్తారు. అటువంటివారే యోగులు. వారిని పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతుంటాడు. మానవుడు సంపాదించుకునే వస్తువుల్లో లౌకికమైనవే కావు, పారమార్థికమైనవీ ఉంటాయి. లౌకిక పదార్థాలను సంపాదించుకోవలసిన బాధ్యత మానవులదే! అయితే, పరమేశ్వరుడి యందే తమ కర్మఫలాలను అర్పించినవారికి ఆ వస్తువులు సుఖాన్ని కలిగించకపోవు. ఇక పారమార్థిక జీవనం సాగిస్తూ, జ్ఞానసంపదను ఎవరైతే సంపాదిస్తారో, అటువంటివారిని రక్షించవలసిన బాధ్యత పరమేశ్వరుడిదే. ‘యోగ’ శబ్దం విశేషార్థాన్నిస్తుంది. యోగమార్గంలో నడుస్తూ జీవన్ముక్తికి కారణభూతమైన జ్ఞానాన్ని సంపాదించేవారిని రక్షించేవాడు పరమేశ్వరుడే.
లోకంలో సంపాదన అనేది రకరకాలుగా ఉంటుంది. కష్టపడకుండా సంపాదించుకోవచ్చు. ఇతరులను కష్టపెట్టకుండా సంపాదించుకోవచ్చు. న్యాయంగా సంపాదించవచ్చు. ఎవరైతే ధర్మానికి విఘాతం కలిగించకుండా సంపాదిస్తారో వారికే పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. ధనార్జన కన్నా కీర్తి సంపాదన ఉత్తమం. కూడబెట్టిన ధనాన్ని స్వార్థబుద్ధితో తానే అనుభవించక, ఇతరులకు దానం చేస్తే కీర్తి వస్తుంది. కీర్తి సంపాదన కన్నా మోక్ష సంపాదన అత్యుత్తమం. పురుషార్థాల్లో మోక్షమే శ్రేష్ఠమైనది. జ్ఞానులు దాన్ని సంపాదించడానికే సత్యాన్ని ఆశ్రయిస్తారు. ఐహిక సుఖాల కన్నా, అలౌకిక సుఖం (మోక్షం) కోసం ప్రయత్నిస్తారు. అందుకు కర్మయోగాన్ని లేదా జ్ఞానయోగాన్ని అనుసరిస్తారు.
పిల్లల యోగక్షేమాలను చూసే బాధ్యత తల్లిదండ్రులది. శిష్యుల యోగక్షేమాలను చూసే బాధ్యత గురువులది. కుటుంబ సభ్యుల యోగక్షేమాలను చూసే బాధ్యత యజమానిది. ఒకరి యోగక్షేమాలు మరొకరు చూసినప్పుడే లోకం బాగున్నట్లు. చిత్రమేమంటే మనిషి కొన్ని పరిమితులకు లొంగి వ్యవహరిస్తాడు. తాను, తన కుటుంబం, తన పరిసరాల వరకే అతని బుద్ధి పనిచేస్తుంది. కానీ, విశ్వకల్యాణ కారకుడైన పరమేశ్వరుడు అందరి యోగక్షేమాలను చూస్తాడు. అందుకే ఆయన మనకు తల్లిగా, తండ్రిగా, గురువుగా, స్నేహితుడిగా భాసిస్తాడు.
ఒక్కసారి కురుక్షేత్ర యుద్ధాన్ని గమనిస్తే, దుర్యోధనాదులు తమ యోగక్షేమాలను తామే చూసుకున్నట్లు అర్థమవుతుంది. అసహాయ శూరులమనే భావన వారిది. కానీ, పాండవులు అలాంటివారు కారు. పాండురాజు దివంగతుడైన తర్వాత పాండవులను పరామర్శించడానికి వచ్చిన శ్రీకృష్ణుడితో ధర్మరాజు పలికిన పలుకులు ఉదాత్తమైనవి.
‘ఆపదఁ గడవం బెట్టఁగ
నోపి శుభంబైనదాని నొడఁగూర్పను మా
కీ పుట్టువునకుఁ పాండు
క్ష్మాపాలుడు నిన్నుఁ జూపి చనియె మహాత్మా! (మహాభారతం)
ప్రపంచంలో ఎవరికివారు సమర్థులు కారు. ఎంత బలశాలురైనప్పటికీ, పాండవులు దైవాన్ని నమ్ముకున్నారు. ‘పాండురాజు నిన్ను చూపి వెళ్లిపోయాడు’ అన్న మాటల్లో… నీవు మా యోగక్షేమాలు చూసుకుంటావనే పాండురాజు తనువు చాలించాడన్న ధ్వని ఉంది. ఇక మీరే మా దిక్కు అన్న అభిప్రాయమూ ఉంది.
భగవద్గీత కర్మయోగంలో ‘పరస్పరం భావయంతం’ అని ఉంది. మానవులు యజ్ఞాల ద్వారా పంచభూతాలకు తృప్తి కలిగిస్తే, అవి జీవకోటికి అనుకూలంగా ఉంటాయట. యజ్ఞం వల్ల మేఘం ఏర్పడితే, ఆ మేఘం వల్ల వర్షం కురిసి లోకం సుభిక్షమవుతుంది. ప్రకృతిలో సహకార గుణం ఉంది. ఈ రహస్యం తెలిసినవారు పరులకు హితకారులై, పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతారు.
ఆచార్య మసన చెన్నప్ప
98856 54381