భగవంతుడిపై నమ్మకం లేకున్నా, ఏ తత్వసిద్ధాంతమూ లేకపోయినా, ఏ మతశాఖకూ చెందకపోయినా, దేవాలయానికి వెళ్లకపోయినా.. శుద్ధభౌతికవాది నని చెప్పుకొన్నా పరమపదాన్ని పొందటం ఎవరికైనా సాధ్యమేనని బుద్ధుడి జీవితాన్ని బట్టి తేటతెల్లమవుతుంది. ఇతర ప్రవక్తలు, పుణ్యాత్ములు భక్తి, యోగ, జ్ఞాన మార్గాల్లో ఏ పరమోన్నత స్థితిని పొందారో బుద్ధుడు ఆ స్థితిని పొందాడు. పరిపూర్ణత్వం నిష్కామకర్మ వల్ల సాధ్యమని నిరూపించిన మహోన్నత కర్మయోగి బుద్ధుడు.
ఒకసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, బుద్ధుడికి జ్ఞానోదయమైన బుద్ధగయ ను సందర్శించారు. తథాగతుడిని తలచుకుంటూ, ఆ పుణ్యస్థలిలో నిర్మితమైన సుందర మందిరంలో అడుగుపెట్టారు. అక్కడ ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి మూర్తిని ఆరాధన పూర్వకంగా ఆవాహన చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు రవీంద్రుడు. ఇంతలో జపాన్ నుంచి నుంచి వచ్చిన యువజాలరి మౌనంగా ఆ మందిరంలోకి ప్రవేశించాడు. ఆ దయాసింధువు దివ్యవిగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. పదేపదే తనలో తాను ‘నేను బుద్ధుడిని శరణుజొచ్చాను… నేను బుద్ధుడిని శరణుజొచ్చాన’ని అనుకుంటూ ఉన్నాడు. ఠాగూర్ ఆ యువకుణ్ని ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయారు. సాయంకాలం దాటిపోయింది. చీకట్లు కమ్ముకున్నాయి. నిర్జన, నిశ్శబ్దమైన అర్ధరాత్రి ఆసన్నమయ్యే దాకా ఆ యువకుడు అక్కడే ఏకాగ్రచిత్తుడై అలా ప్రార్థిస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ యువకుడు ఆలయం నుంచి బయటకు వస్తుండగా, రవీంద్రుడు ఆసక్తిగా ఆయనను పలకరించారు.
అప్పుడు ఆ జపాన్ యువకుడు విశ్వకవితో తన మనసులోని భావాలను పంచుకుంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ‘నేను ఎన్నో అపరాధాలను చేశాను. కానీ, ఈ మహానుభావుడి గురించి తెలుసుకున్నాక, ఆయన బోధనల్ని చదివాక, నేను ఎంతో మారిపోయాను. ఇక ఎన్నడూ ఆ పాపపు పనులు చేయను. ఆ పశ్చాత్తాప భావాల్ని ప్రత్యక్షంగా ఆయన మూర్తి ముందు ప్రకటించడానికి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చాను’ అన్నాడు. అప్పుడు రవీంద్రుడు దీర్ఘాలోచనతో ‘ఆ మహానుభావుడి అడుగుజాడల్లో నడుస్తున్న అసలైన అనుయాయులే.. బుద్ధుడి నిజమైన అభిమానులు! ఆ చరితార్థుడు నడిచిన ఈ భూమిపై మనం ఆయన బోధనల్ని ఏ మాత్రం ఆచరిస్తున్నాం?’ అనుకొని అంతరంగ మథనంలో పడ్డారు.
బుద్ధుడి రూపాన్ని కాదు ఆయన హృదయాన్ని పట్టుకోవాలి. బుద్ధుడి బొమ్మ కన్నా ఆయన బోధనలకి ఆకర్షితులం కావాలి. సిద్ధార్థుడు యువరాజుగా తన యవ్వనాన్ని, రాజ్యాన్ని, కన్నవారిని, భార్యను, కొడుకును, సుఖాలను, సంతోషాలను, సమస్త భోగాలను, సుందరమైన జీవితాన్ని పక్కకు పెట్టి, శాశ్వత శాంతి కోసం బయలుదేరాడు. శాంతిని, ప్రేమను లోకానికి పంచే ప్రయత్నం చేశాడు. సిద్ధార్థుడు అంటేనే మూర్తీభవించిన ప్రేమ, దయ, కరుణ. ఆ విశ్వకారుణ్యమూర్తి మండుటెండల్లో కష్టపడుతున్న కర్షకులు కంట కనబడగానే కుమిలిపోయి తలవంచుకునేవాడట. కట్టుకోవటానికి బట్టలు లేక అవస్థలు పడుతున్న బీదరాలిని చూడగానే బాధతో నిట్టూర్పులు విడిచేవాడట! పూజ పేరుతో భక్తులు నిర్దాక్షిణ్యంగా పూలను కోస్తూంటే కదలిపోయి కన్నీళ్లు కార్చేవాడట! చేతులు కాయలు కాసేట్లు కట్టెలు కొట్టుకునే కార్మికులు కంటపడితే కరిగినీరైపోయేవాడట!
దైవత్వం అంటే ఇదే కదా! తనను తాను తెలుసుకోవడం తపస్సు. లోకం గురించి తెలుసుకోవడం అంతకుమించిన సాధన. ఆ మార్గంలో నడిచాడు బుద్ధుడు. నిజమైన జ్ఞానాన్ని పొందాడు. తాను పొందిన జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. సత్యం, అహింస ఆయన సూచించిన ప్రధాన మార్గాలు. వాటిని ఆచరించిన వాళ్లు దైవాన్ని ఆరాధించినట్లే అవుతుంది. అలాంటి ఆరాధనను దేవుడు తప్పక స్వీకరిస్తాడు.
మనోజ్ఞ