బీజింగ్, అక్టోబర్ 24: దురాక్రమణ కాంక్షతో పేట్రేగిపోతున్న చైనా మరో ఎత్తుగడ వేసింది. కొంత కాలంగా భారత్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు మరింతగా ఆజ్యం పోస్తూ కొత్తగా సరిహద్దు చట్టాన్ని తీసుకొచ్చింది. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో భాగంగా దీనిని తీసుకొచ్చినట్టు వెల్లడించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ)కి చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులు శనివారం ఈ చట్టాన్ని ఆమోదించినట్టు చైనా మీడియా పేర్కొంది. జనవరి 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రానున్నట్టు వివరించింది.
చట్టంలో ఏమున్నది?
సరిహద్దుల్లో ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్టు చట్టంలో పేర్కొన్నారు. సరిహద్దుల్లో రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేయనున్నట్టు తెలిపారు. తమ సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా ఇతరులు చేపట్టే పనులను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలనైనా చేపడుతామని హెచ్చరించారు.
భారత్పై ప్రభావం ఎలా?
గతేడాది గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలతో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒకవైపు, భారత్తో శాంతి చర్చలు జరుపుతూనే.. మరోవైపు, సరిహద్దుల్లోకి బలగాలను, ఆయుధ సామగ్రిని చేరవేసేందుకు డ్రాగన్ దేశం కుట్రలు పన్నుతూనే ఉన్నది. తాజా చట్టం అమల్లోకి వస్తే, భారత్కు చైనాతో ఉన్న సున్నితమైన సరిహద్దుల్లోకి ఆ దేశం పెద్దఎత్తున బలగాలను, ఆయుధాలను తరలించే ప్రమాదమున్నదని నిపుణులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు నివసించేలా మౌలిక సదుపాయాలను కల్పించడం కూడా ఆక్రమణలో భాగమేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చైనాకు మొత్తం 14 దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇందులో 12 పొరుగు దేశాలతో చైనా సరిహద్దును నిర్ణయించుకున్నప్పటికీ.. భారత్, భూటాన్తో మాత్రం ఆ దేశానికి సరైన సరిహద్దు లేదు. దీంతో భారత్తో 3,488 కిలోమీటర్లు, భూటాన్తో 400 కిలోమీటర్ల మేర సరిహద్దు వివాదాస్పదంగా ఉంది. కాగా, సమానత్వం, పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంప్రదింపులు, చర్చల ద్వారా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంటామని తాజా చట్టంలో చైనా పైకి చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అలా కనిపించడంలేదు.