Arunachal Pradesh : భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్లోని 60 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని, చైనా సైన్యం చొచ్చుకొచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం తిప్పికొట్టింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమే అన్నారు. ఈ అంశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్లోని 60 కిలోమీటర్ల ప్రాంతంలోకి చైనా ప్రవేశించిందనేది అబద్ధమని, దీనికి సంబంధించి షేర్ అవుతున్న వీడియోలు తప్పు అని ఆయన అన్నారు.
ఇదంతా తమ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగుతున్న ప్రచారమన్నారు. ‘‘అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దు సమస్య ఉంది. ఈ అంశంపై స్తానిక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. వారి ఆందోళనకు అర్థం ఉంది. ఎందుకంటే ఇరు దేశాల మధ్య సరిహద్దులు నిర్ణయించకపోవడం వల్లే ఇదంతా. హద్దులు గుర్తించకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల విషయంలో ఇలాంటి ప్రచారాలు సహజం. అంతమాత్రాన మన గ్రామాల్ని చైనా ఆక్రమించుకున్నట్లు కాదు. మన భూభాగం మీద ఎప్పటినుంచో చైనా దృష్టి ఉంది. భారత సరిహద్దు మరింత విస్తరించింది. ఈ ప్రాంతంలో చైనా వైపు ఉన్న టిబెటన్లు, ఇతర స్థానికులు తమ భూభాగం మరింత దూరం విస్తరించి ఉందని భావించడం వల్ల గందరగోళం ఏర్పడుతోంది.
India-China Border issue is a serious subject. Do not make false claim on such sensitive matter. We don’t want to repeat the past mistakes. Govt will address the concern of the local people and protect Indian Territory. pic.twitter.com/AZXTMUlujm
— Kiren Rijiju (@KirenRijiju) August 19, 2026
దీన్ని సాకుగా చూపి, అరుణాచల్ ప్రదేశ్లోని 60 కిలోమీటర్లు ఆక్రమించుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అవి బంగ్లాదేశ్కు సంబంధించిన ఫొటోలు. మన ఆర్మీ, భద్రతా బలగాల్ని తక్కువ చేసేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీంతో దేశంలో గందరగోళం ఏర్పడుతోంది’’ అని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు వెల్లడించారు. చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీతోపాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు కూడా పహారా కాస్తున్నట్లు తెలిపారు.