న్యూఢిల్లీ : త్వరలో 12 సంవత్సరాలు పైబడిన చిన్నారులకు కేంద్రం టీకాలు వేయనుంది. అయితే, పూర్తిస్థాయిలో చిన్నారులందరికీ ఇప్పుడే వ్యాక్సిన్ అందే అవకాశం లేనట్లు తెలుస్తోంది. కొవిడ్-19 టీకాపై ప్రభుత్వానికి సలహా ఇచ్చే కమిటీ ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 40 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ ప్రారంభమైతే.. ఇప్పటికే నడుస్తున్న 18 సంవత్సరాల పైబడిన వ్యక్తుల టీకా డ్రైవ్పై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఇదే జరిగితే థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే రోజుల్లో దేశంలో ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు ఆసుప్రతుల్లో పడకల కొరత ఏర్పడే ప్రమాదం ఉందనే ఆందోళనలున్నాయి. ఈ క్రమంలో 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాలు వేయాలని కమిటీ సిఫారసు చేసింది.
ప్రతి పిల్లవాడిని పాఠశాలకు పంపే ముందు టీకాలు వేయాల్సిన అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్న పిల్లలు టీకా కోసం మరికొంత సమయం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుందని కొవిడ్ వ్యాక్సిన్పై నిపుణుల కమిటీ చైర్మన్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. ఈ సమయంలో పిల్లలకు టీకాలు వేస్తే టీకాలు వేస్తే టీకా డ్రైవ్ మరింత వెనుకపడే ప్రమాదం ఉందని తెలిపారు. యువత, వృద్ధులకు వ్యాక్సిన్ అందకపోతే.. ఆసుప్రతుల్లో వైరస్ సోకిన వారి సంఖ్య పెరగడం ప్రారంభమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ డోస్ కమిటీ సలహా ప్రకారం.. తీవ్రమైన వ్యాధులు ఉన్న పిల్లలు టీకాలు ముందుగా వేయనున్నారు.
మూత్రపిండాల మార్పిడి, పుట్టినప్పటి నుంచి క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించిన టీకాను ప్రభుత్వం ఆమోదించలేదు. మూడు కంపెనీలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. జైడస్ కాడిలా డీఎన్ఏ ఆధారిత టీకా 12-17 సంవత్సరాల మధ్య పిల్లలపై ట్రయల్స్ పూర్తి చేసింది. టీకా అత్యవసర వినియోగం కోసం సైతం కంపెనీ దరఖాస్తు చేసింది. దీంతో పాటు పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2-12 సంవత్సరాల పిల్లలకు సంబంధించిన టీకా కోవావాక్స్ రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తోంది.