హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ ఎంపీ అరవింద్ అబద్ధాల కోరు, అసత్యాల పుట్ట అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తానని బాండ్పేపర్ రాసిచ్చి విస్మరించిన అబద్ధాల కోరు అని అన్నారు. సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్పై ఇష్టారీతిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రైతు హంతక బీజేపీకి టీఆర్ఎస్ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని, బీజేపీ నేతలు ఒళ్లు, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అరవింద్.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను గొర్లు, బర్లతో పోల్చడాన్ని వినయ్భాస్కర్ తీవ్రంగా ఖండించారు. రైతులపై బీజేపీ నేతలు లేని ప్రేమను ఒలకబోస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ఖేరిలో రైతుల్ని నిర్దాక్షిణ్యంగా చంపిన బీజేపీ నేతలు రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం అలుపెరుగకుండా 14 ఏండ్లు పోరాటం చేశారని, ఆ మహానేతపై అరవింద్ పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. చేతనైతే కాజీపేట కోచ్ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటి అంశాలపై స్పందించాలని డిమాండ్ చేశారు.