1946-48 మధ్యకాలంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ 1980వ దశకంలో కూడా నవలలు వచ్చాయి. రచయితలు తమ చిన్ననాటి అనుభవాలు, జ్ఞాపకాల ఆనవాళ్లతో వారు ఈ నవలలను రాశారు. అంపశయ్య నవీన్- ‘కాలరేఖలు’, బి.ఎన్ శాస్త్రి- ‘విప్లవ జ్వాల’, కందిమళ్ల ప్రతాపరెడ్డి-‘బందూక్’, సరిపల్లె కృష్ణారెడ్డి-‘ఉప్పెన’, బోయజంగయ్య-‘జగడం’, అశోకమిత్రన్- ‘జంటనగరాలు’, ముదిగంటి సుజాతారెడ్డి- ‘మలుపు తిరిగిన రథ చక్రాలు’ రాశారు. అలాగే తెలుగులోనే కాకుండా.. హిందీలో వ్యాస్- ‘రజాకార్’, కిషన్చందర్ ఉర్దూలో, హరీంద్రనాథ ఛటోపాధ్యాయ
(సరోజినీ నాయుడు సోదరుడు) ఇంగ్లీష్లో పోరాటాన్ని చిత్రిస్తూ నవలలు రాశారు. ప్రపంచంలో ఏ ఉద్యమాన్ని చిత్రిస్తూ ఇన్ని నవలలు రాలేదంటే అతిశయోక్తి కాదు.
1960-70 దశకంలో తెలంగాణ నుంచి సాహిత్యమే రాలేదని కొందరంటారు. కానీ ఆకాలంలో తెలంగాణ నుంచి మాదిరెడ్డి సులోచన ఆంధ్రప్రాంత రచయితలకు ధీటుగా చక్కటి నవలలను రచించింది. ఆమె దాదాపు వంద నవలలు రచించారు. పొల్కంపల్లి శాంతాదేవి 70కి పైగా నవలలు, బొమ్మ హేమాదేవి 40కిపైగా నవలలు రాశారు. వనజ అనే రచయిత్రి ‘అడవిపుత్రిక’ నవల రాసింది. గీతాంజలి స్త్రీవాద సిద్ధాంతాన్ని చెప్పే ‘ఆమె అడవిని జయించింది’, ముదిగంటి సుజాతారెడ్డి ‘ఆకాశంలో విభజన రేఖల్లేవు’ అనే నూతన దృక్పథంతో స్త్రీ వాదా న్ని చిత్రిస్తూ నవలలు రచించారు. తెలంగాణ నుంచి అనేక స్త్రీవాద కథలు, నవలలు వచ్చా యి. బి.ఎన్ శాస్త్రి ‘తుక్కాదేవి’, ‘వాకాటక’, ‘మహాదేవి’ వంటి చారిత్రక నవలలను రాశా డు. దాశరథి కృష్ణమాచార్యులు ‘అమర శిల్పి జక్కన’ నవల ప్రసిద్ధమైంది. ప్రభాకర్ జైని ‘చోర్ బజార్’, ‘లక్ష్యం’, ‘గమ్యం’, ‘నిఘా’ అనే నవలలు రాశారు. పెద్దింటి అశోక్కుమార్ ‘జిగిరి’ నవల హిందీ, పంజాబీ భాషల్లోకి అనువాదమైంది.
దళితవాదానికి సంబంధించిన నవలలు తెలంగాణలో చాలా వచ్చాయి. బోయ జంగ య్య- ‘చీమలు’, ‘దున్న’, ‘గొర్రెలు’, ‘జాత ర’,‘ జగడం’, ‘ఇప్పపూవు’; వేముల ఎల్ల య్య- ‘కక్క’, ‘సిద్ది’; కదిరెకృష్ణ-‘పొద’; భూతం ముత్యాలు-‘సుర’, ‘పురుడు’; జాతశ్రీ- ‘బలిపశువు’, ‘వెదురు పొదలు’, ‘మేఘశ్యాం’, ‘లహరి’ అనే దళిత నవలలు రచించారు.1987లో ఎం.వి.తిరుపతయ్య- ‘బతుకు న్యాయం’, ‘జీవన సమరం’ అనే నవలలను తెలంగాణ మాండలికంలో రచించాడు. ఎమర్జెన్సీ కాలాన్ని చిత్రిస్తూ అంపశయ్య నవీన్- ‘చీకటి రోజులు’ నవలను రచించాడు.
తెలంగాణ నుంచి విప్లవోద్యమ నవలలు చాలా వచ్చాయి. చెరబండరాజు ‘మా పలె’్ల, ‘వేలాడిన మందారం’; అల్లం రాజయ్య-‘కొలిమంటుకున్నది’, ‘ఊరు’, ‘నిప్పురవ్వ’ మొదలైనవి రాశాడు.అల్లం రాజయ్య, సాహు తో కలిసి రాసిన చారిత్రక నవల ‘కొమురం భీం’; తుమ్మేటి రఘోత్తంరెడ్డి-‘నల్ల వజ్రం’, సాధన అనే అజ్ఙాత విప్లవకారుడు, రచయిత ‘రాగో’, ‘సరిహద్దు’ నవలలు, వసంతరావు దేశ్పాండే ‘అడవి’; పి.చంద్- ‘శేషగిరి’, ‘నల్లమల’ అనే విప్లవోద్యమ నవలలు రచించారు.
తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని, ప్రత్యేక రాష్ట్రసాధన ఉద్యమాన్ని చిత్రిస్తూ.. పరవస్తు లోకేశ్వర్-‘సలాం హైద్రాబాద్’; పెద్దింటి అశోక్ కుమార్-‘లాంగ్ మార్చ్’ మొదలైన నవలలు వచ్చాయి. ఈ విధంగా తెలంగాణ నుంచి నవలా సాహిత్యం కూడా చెప్పుకోదగిన రీతిలో విస్తృతంగా వచ్చింది. ప్రతీ నవల కూడా ఆయా కాలం నాటి సమాజాన్ని, ప్రజా జీవితాన్ని, ఉద్యమాలను పోరాటాలను చిత్రీకరిస్తూ ఉన్నవి.
ఆధునిక సాహిత్యంలో కథ, నవలలతో పాటు కొత్తగా వచ్చిన ప్రక్రియ ‘వ్యాసం’. ఇంగ్లీష్లో ఉన్న ‘ఎస్సే’ అనే పదానికి సమానార్థకంగా ‘వ్యాసం’ అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నాం. వ్యాస శబ్దానికి విభజించటం అనే అర్థం ఉన్నది. కృష్ణద్వైపాయనుడు వేదాల ను నాలుగు భాగాలుగా విభజించి క్రమపద్ధతిలో పెట్టాడు కాబట్టి అతనికి ‘వేద వ్యాసు డు’ అనే పేరు వచ్చింది. ఆ విధంగా వ్యాస శబ్దము ప్రాచీనమైనది. వ్యాస పదానికి ఇంకా వివరించటం, విశ్లేషించటం, సమీక్షించటం, విమర్శించడం, అనుశీలించడం అనే అర్థాలు చెప్పుకోవచ్చు.
తెలుగులో వ్యాసరచన ప్రారంభమైన కాలంలో ‘ప్రమేయం’, ‘సంగ్రహం’,‘ఉపన్యాసం’ అనే పేర్లతో వ్యాసప్రక్రియను పిలిచారు. సి.పి. బ్రౌన్ ‘ఎస్సే’ అనే పదానికి ‘వ్యాసం’ అని మొదట వాడాడు. ఆయన తెలుగు భాషా సాహిత్యాలకు ఇంగ్లీష్లో రాసిన వ్యాసమే మొదటి వ్యాసం. శబ్దరూపంలో ఉన్నైట్లెతే అది ‘ఉపన్యాసం’ అని, అక్షర రూపంలో ఉన్నట్లయితే అది ‘వ్యాసం’ అనీ.. ఈ పదాలు వీరేశలింగం కాలంలో స్థిరపడ్డాయి. 1890 నుంచి ‘వ్యాసం’ అనే పదం ఈ ప్రక్రియకు పేరుగా స్థిరపడింది.
ఆధునిక కాలంలో సాహిత్యం- సమాజానికి ఒక పొత్తు ఏర్పడింది. ప్రాచీన కాలంలో సాహిత్యం అంటే.. కొన్ని వర్గాల వారికే అర్థమయ్యేది. దానికొక సామాజిక ప్రయోజనం ఉండేదికాదు. కాని సంఘసంస్కరణ కాలంలో సాహిత్యప్రయోజ నం దృష్టి మారింది. ‘సాహిత్యం సమాజ అభ్యున్నతికి’ అని ఆచరణలో చూపినవారు వీరేశలింగం పంతులు. సామాజిక అభ్యున్నతితో పాటు సాహి త్య అభ్యున్నతికి తోడ్పడిన వాడు వీరేశలింగం.
ముదిగంటి ,సుజాతారెడ్డి
99634 31606