కాకతీయులు చేసినన్ని ప్రజోపయోగ నిర్మాణాలు మరే రాజవంశం వారు చేయలేదు. ఆ రాజుల అండతో సమస్త సామంతులు, వ్యాపారులు, ఇతరవర్గాల ప్రజలు కూడా తమ స్థాయికి తగిన విధంగా ఆయా నిర్మాణాలు, దానధర్మాలు నిర్వహించారు. వరంగల్లు జిల్లాలోని గిర్మాజిపేటలో కాకతీయ గణపతి దేవుని కాలంలో పద్మశాలీలు వేయించిన ఒక శాసనం చాలా విశేషమైంది. ఈ శాసనంలో గణపతిదేవుడు చాలా ప్రత్యేకంగా కీర్తించబడినాడు. శాసనకాలం సర్వజిత్తు సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమి=క్రీ.శ.1228.
శాసనం ప్రారంభంలోనే కాకతీయ గణపతిదేవ చక్రవర్తి ప్రశంస ఉన్నది. ‘పరనారీ సెదర లాడ, చోడ, కటక చూరకార మన్నియ బెంటకార విభవ దేవేంద్ర సత్యహరిశ్చంద్ర శ్రీ స్వయంభూ దేవర దివ్యశ్రీపాద పద్మారాధక పరబల ప్రతాపఖ్యాత విత్తహార నితి ప్రతిష్ఠాపక శరణాగత వజ్ర పంజర పరబల సాధక ఉపమన్యు ప్రముఖ భక్త జనానందకర వైరి సంహరణ చతుస్స ముద్రవలయ దిక్పూరిత కీర్తి సప్తమ చక్రవర్తి..’ అని పేర్కొనబడినాడు. ఇతడు లాడ, చోడ, కటక రాజ్యాలను జయించి నట్లు, ఉపమన్యు మొదలైన భక్త జనులకు ఆనందం కలిగించేవాడుగా, నాలుగు సముద్రాలతో కూడిన దిక్కులనిండిన కీర్తి కలిగినవాడుగా, కాకతీయ వంశంలో 7వ చక్రవర్తిగా పేర్కొనబడినాడు.
మూడు పట్టణాల మధ్యలో మటియ స్థలంలో ధర్మసాలియ జనులు (పద్మశాలీలు) అందరి తరఫున నిజరంగాల మన్నిసెట్టి, అతని కుమారుడు వెన్నిసెట్టి వారి వృత్తి పేరు మీద సాలేశ్వర దేవుని, ప్రభువైన గణపతి దేవుని పేరు మీద గణపతేశ్వర దేవుని, సకల భక్తుల పేరు మీద సకలేశ్వర దేవుని ప్రతిష్ట చేసి దానాదులు
నిర్వహించినారు.
ఈ ముగ్గురు దేవుళ్ల అంగరంగ భోగాలకు ఇచ్చిన వృత్తులు ఏమంటే తాము అమ్మిన చీరల మీద ప్రతి గద్యాణకు ఒక వీసము ఆచంద్రార్కముగా ఇచ్చి శాసనం వేయించినాడు. ఇంకా చీరమట్టిలోని నకరేశ్వర దేవునికి, ఒరుకట్టి సకలేశ్వర దేవునికి వావిలాల పెద్ద చెఱువున అర్ధ వ్రిత్తి, సమర్పించి శాసనం వేయించినాడు.
శాసనాన్ని గమనించినట్లయితే సాధారణ దాన శాసనంగానే ఉంటుంది. ఇందులో రెండు మూడు విశేష అంశాలున్నాయి. గణపతి దేవుని కీర్తి ప్రతిష్ఠలు చాలా ఘనంగా తెలుపబడినాయి. పద్మశాలీయులు ఇందులో ధర్మసాలియ జనులుగా కీర్తించబడినారు. అంతేకాక వారి వృత్తి మీద గౌరవంతో సలేశ్వర దేవుని, ప్రభుభక్తితో గణపతేశ్వర దేవుని, సమస్త ప్రజల పేరు మీద సకలేశ్వర దేవుని ప్రతిష్టించి వారి అంగరంగ భోగాలకు సమర్పించిన విషయం స్పష్టంగా పేర్కొనబడిం ది. తాముచేసే వృత్తినే దేవునిగా భావిం చి అందులో లాభాదులను భగవంతునికే సమర్పించడమన్నది ప్రత్యేకత.
కాకతీయుల కాలం నాటి, లేదా ఇతర శాసనాలను గమనించినట్లయితే ఈ విధమైన వృత్తి సంబంధ శాసనాలు వెలుగులోకి వస్తాయి. వాటిని విశ్లేషించుకుంటే ఆయా వృత్తుల వారి జీవన విధానాన్ని తెలుసుకోవచ్చు.