హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీయేనని చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. కొవిడ్తోపాటు వివిధ కారణాలతో ఆర్థికంగా చితికిపోయిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయాన్ని బుధవారం ఆయన ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో కలిసి అందజేశారు.
కరోనాతో మరణించిన 65 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షలు, సాధారణంగా మరణించిన 40 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష, ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి మొత్తం రూ.1.74 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. మాసబ్ట్యాంక్లోని మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లం నారాయణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముందు చూపు, ప్రత్యేక చొరవతోనే జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటైందని, ఈ నిధికి రూ.42 కోట్లు విడుదల చేశారని తెలిపారు. దీని నుంచి ఇప్పటివరకు 353 కుటుంబాలకు రూ.లక్ష, మరో 116 మందికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేసినట్టు వివరించారు.
కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ.5.70 కోట్ల సహాయం చేశామని చెప్పారు. జర్నలిస్టులకు ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి రూ.100 కోట్లు కేటాయించడంతోపాటు ఇప్పటివరకు 500 మందికి సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తన ఎదుగుదలలో జర్నలిస్టు మిత్రుల సహకారం ఎంతో ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర్రావు, సమాచారశాఖ జేడీ జగన్, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచందర్రావు, మేనేజర్ వనజ, టీయూడబ్ల్యూజే కోశాధికారి మారుతి సాగర్, టెంమ్జు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, టీపీజేఏ అధ్యక్షుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.