హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకురాబోతున్న ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకనుంచి విద్యార్థుల సర్టిఫికెట్లన్నింటినీ డిజిలాకర్లో అందుబాటులో ఉంచనున్నారు. అనుమానం వచ్చినవారు ఎప్పుడంటే అప్పుడు ఒకే ఒక్క క్లిక్తో వీటిని పరిశీలించుకోవచ్చు. డిజిలాకర్తోపాటు సర్టిఫికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించింది.
డీజీపీ మహేందర్రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సహా పలు యూనివర్సిటీల వైస్చాన్స్లర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ నకిలీ సర్టిఫికెట్ల బెడదను పూర్తిగా నివారించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా డాటాను అప్లోడ్చేయాలని, సర్టిఫికెట్లు ముద్రణ సమయంలోనే అటోమెటిక్గా ఆయా వివరాలను డిజిలాకర్తో అనుసంధానమయ్యేలా చూడాలని తెలిపారు. ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాల సర్వర్ల మధ్య డాటా మార్పిడి వేగంగా జరగాలని, ఫేక్ సర్టిఫికెట్ దొరకగానే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని వైస్చాన్స్లర్లకు సూచించారు.
ఈ విద్యాసంవత్సరం నుంచి డిజిలాకర్ను అమల్లోకి తీసుకురానున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాలను అరికట్టేందుకు పీడీ యాక్ట్ను తీసుకొచ్చినట్టుగా, ఇదే కోవలో నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు డిజిలాకర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు చెప్పారు. విదేశాల్లో చదువుతున్న మన విద్యార్థుల సర్టిఫికెట్లను సకాలంలో వెరిఫికేషన్ చేయలేకపోతున్నామని, ఆన్లైన్ వెరిఫికేషన్ అందుబాటులోకి వస్తే సులభతరమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ సహా పలు యూనివర్సిటీల వైస్చాన్స్లర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలుగులో ఇగ్నో డిగ్రీ పాఠాలు
ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన క్రమంగా అన్నిస్థాయిల్లో అందుబాటులోకి వస్తున్నది. ఇప్పటికే ఇంజినీరింగ్ కోర్సుల్లో అందుబాటులోకి రాగా, ఎన్ఈపీలో భాగంగా తాజాగా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం సైతం ప్రాంతీయ భాషల్లో బోధనను ప్రారంభించింది. ఇదివరకు హిందీ, ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే ఇగ్నో కోర్సులను నిర్వహించగా, దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ భాషల్లో కోర్సులను ఇగ్నో ప్రారంభించింది. ప్రస్తుతానికి మన వద్ద బీఏ కోర్సును తెలుగుభాషలో ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా స్వయంప్రభ, జ్ఞాన్దర్శన్ టెలివిజన్ల ద్వారా ప్రసారాలు ప్రారంభం కాగా, సోమవారం హైదరాబాద్లోని సోషియాలజీ విద్యార్థులకు పాఠ్యాంశాలను ప్రసారం చేశారు. ఇన్చార్జి రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కే రమేశ్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బోళ్ల రాజు, అకడమిక్ కౌన్సిలర్ డాక్టర్ కృష్ణ, టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ అనిల్కుమార్, పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.