న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: దేశవ్యాప్తంగా విద్యుత్తో నడిచే వాహనాలకు ఎనలేని డిమాండ్ నెలకొంటున్నది. పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో సామాన్యుడు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నది. దీంతో ఇటీవలకాలంలో ఈవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా గతేడాదికాలంలో ఈవీల అమ్మకాలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. వీటికోసం చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కూడా ఊపందుకున్నది. గడిచిన నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా తొమ్మిది మెగా సిటీల్లో వీటి సంఖ్య రెండు రెట్ల కంటే అధికంగా ఉన్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్కతా నగరాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అధికంగా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. అక్టోబర్ 2021 నుంచి జనవరి 2022 వరకు ఈ తొమ్మిది నగరాల్లో 678 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 1,640 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లలో ఈ తొమ్మిది నగరాల్లోనే 940 ఉండటం విశేషం.
40 లక్షల కంటే అధిక జనాభా కలిగిన ఈ తొమ్మిది నగరాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈవీ స్టేషన్ల ఏర్పాటు ఊపందుకున్నది.
దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల వెంబడి 22 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
వీటిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 10 వేల చార్జీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతుండగా..బీపీసీఎల్ 7 వేలు, హెచ్పీసీఎల్ 5 వేల స్టేషన్లను నెలకొల్పబోతున్నది.
ఇప్పటికే ఐవోసీఎల్ 439 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, మరో ఏడాదికాలంలో మరో 2 వేల స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది కూడా. బీపీసీఎల్ 52, హెచ్పీసీఎల్ 382 స్టేషన్లను నిర్వహిస్తున్నాయి.