న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఓ రహస్య ప్రాంతంలో జరిగే వింతలకు కారణం కనుక్కొనేందుకు నాసా ప్రయత్నిస్తున్నది. అక్కడికి వెళ్లగానే స్పేస్ క్రాఫ్ట్లు ఎందుకు నెమ్మదిస్తున్నాయి.. అక్కడ గాలి సాంద్రత ఎందుకు ఎక్కువగా ఉన్నది.. అనేది తెలుసుకోవడానికి ఈ నెల 1న రాకెట్ను పంపించింది. భూ అయస్కాంత క్షేత్రం మనల్ని సౌర గాలుల నుంచి రక్షిస్తుంది. ఇది భూమికి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉంటుంది. సాధారణంగా సూర్య కిరణాలు ఏ సందర్భంలోనైనా భూమిలో ఒక అర్ధభాగంపైనే ప్రసరిస్తాయి. అప్పుడు ఆ అర్ధభాగం అయస్కాంతక్షేత్రం భూమిపై ఎక్కడ చూసినా సమానంగా ఉండాలి. కానీ ధ్రువాల వద్ద క్షేత్రం కొద్దిగా కుంచించుకుపోవడమే కాకుండా ఒక పైపు లాంటి నిర్మాణం ఏర్పడుతున్నది. దీనిని ‘పోలార్ కస్ప్’ అని పిలుస్తున్నారు.
గాలి ప్రవాహాల అధ్యయనం
అంతరిక్షంలో కేవలం పోలార్ కస్ప్లో మాత్రమే గాలి సాంద్రత ఎందుకు ఎక్కువ ఉందనేది శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు. దీన్ని తెలుసుకోవడానికి కస్ప్ రీజియన్ ఎక్స్పెరిమెంట్-2(క్రెక్స్-2) పేర సౌండింగ్ రాకెట్ ఓరియోల్ను నాసా పంపించింది. ఈ రాకెట్ కస్ప్ ప్రాంతంలోకి వెళ్లాక అక్కడ నాలుగు వైపులా పొగలాంటి రంగులను వెదజల్లుతుంది. అవి ఏ వైపుగా కదులుతున్నాయనే సమాచారం ఆధారంగా అక్కడి గాలి ప్రవాహాలను అధ్యయనం చేస్తుంది.