ఒకట్రెండు రోజుల్లో ఇందుకు అవకాశం
స్థానికత, విద్యార్హతల మార్పులకు చాన్స్
వెబ్సైట్లోనే మార్చుకొనే వెసులుబాటు
కసరత్తు పూర్తిచేసిన టీఎస్పీఎస్సీ అధికారులు
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో మార్పులకు అవకాశం కల్పించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను సంప్రదించి, ఓటీఆర్లో ఎడిట్ ఆప్షన్ను ఎంచుకొని, కొత్త స్థానికత, విద్యార్హతలను మార్చుకొనే వెసులుబాటు కల్పిస్తారు. ఇందుకు కమిషన్ కసరత్తు పూర్తిచేసింది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో స్థానికత అర్హతలను సైతం తెలంగాణ ప్రభుత్వం మార్చింది. ఇది వరకు 4 నుంచి 10 తరగతుల వరకు 4 ఏండ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లాలో స్థానికుడిగా పరిగణించేవారు. ఇప్పుడు 1 నుంచి 7 తరగతుల్లో చివరి 4 ఏండ్లు ఏ జిల్లా, జోన్, మల్టీ జోన్లో చదివితే ఆ జిల్లా, జోన్, మల్టీ జోన్లలో స్థానికుడిగా పరిగణిస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నది. ఈ లెక్కన టీఎస్పీఎస్సీ ఓటీఆర్లో మార్పులు చేయాల్సి ఉన్నది. దీంతో కమిషన్ వెబ్సైట్లో మార్పులకు అధికారులు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులు 1 నుంచి 7 తరగతులను ఏ జిల్లాలో చదివారో పొందుపరిస్తే, ఏ జిల్లా, జోన్, మల్టీ జోన్కు చెందినవారో ఆటోమెటిక్గా వెబ్సైట్ చెప్పేస్తుంది. ఇలా వెబ్సైట్ను అత్యాధునికంగా రూపొందించారు. ఒకట్రెండు రోజుల్లోనే ఈ అవకాశాన్నిస్తున్నట్టు కమిషన్ అధికారులు వెల్లడించారు.
జిల్లాస్థాయి పోస్టులకు స్థానికత ఇలా..
ఒక అభ్యర్థి 1 నుంచి 7వ తరగతి వరకు లేదా 4 నుంచి 7 తరగతులు జనగామ జిల్లాలో చదివితే సదరు అభ్యర్థి ఆ జిల్లాలోనే పోటీపడవచ్చు.
ఒక అభ్యర్థి 1 నుంచి 3వ వరకు నారాయణపేట, 4,5 తరగతులు వికారాబాద్, 6,7 తరగతులు నారాయణపేటలో చదివితే నారాయణపేటనే స్థానికత అవుతుంది.
ఒక అభ్యర్థి 1 నుంచి 5 వరకు నాగర్కర్నూల్, 6,7 తరగతులు రంగారెడ్డి జిల్లాలో చదివితే రంగారెడ్డినే స్థానికత అవుతుంది.
ఒక అభ్యర్థి 1నుంచి 6 వరకు ఒక్కొక్క తరగతి ఒక్కో జిల్లాలో చదివి.. 7వ తరగతి మంచిర్యాల జిల్లాలో చదివితే మంచిర్యాల స్థానికతగా పరిగణిస్తారు.
ఒక అభ్యర్థి 1 నుంచి 6 వరకు తెలంగాణలోని 6 వేర్వేరు జిల్లాల్లో చదివి.. 7వ తరగతిని ఆంధ్రప్రదేశ్లో చదివితే స్థానికులు కాదు.. ఓపెన్ కోటాలో పోటీపడాల్సిందే.
ఒక అభ్యర్థి 1 నుంచి 3 వరకు హైదరాబాద్లో, 4 నుంచి 6 వరకు రంగారెడ్డిలో, 7వ తరగతి వికారాబాద్లో చదివితే రంగారెడ్డినే స్థానికత అవుతుంది.
జోనల్, మల్టీ జోన్ పోస్టులకు స్థానికత ఇలా..
ఒక అభ్యర్థి 4,5,6,7 తరగతులు బాసర జోన్లోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కడ చదివినా ఆ జోనల్ పోస్టులన్నింటికీ పోటీపడవచ్చు.
4, 5 తరగతులు కాళేశ్వరం జోన్లోని జిల్లాల్లో, 6,7 తరగతులు రాజన్న జోన్లో చదివితే రాజన్న జోన్ను స్థానికతగా లెక్కిస్తారు.
మల్టీ జోన్ విషయానికి వస్తే.. మల్టీ
జోన్-2లోని చార్మినార్ జోన్లో 4,5,6,7 తరగతులు చదివిన అభ్యర్థి ఆ మల్టీ జోన్ పరిధిలోని అన్ని పోస్టులకు అర్హులు.
మల్టీ జోన్-1లోని భద్రాద్రి జోన్లో 4,5, కాళేశ్వరం జోన్లో 6,7 తరగతులు చదివితే, మల్టీ జోన్-1లోని పోస్టులన్నింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు.
మల్టీ జోన్-1లో 4,5 తరగతులు, మల్టీ జోన్-2లో 6,7 తరగతులు చదివిన వారు మాత్రం మల్టీ జోన్-2లోని ఉద్యోగాలకే పోటీపడాల్సి ఉంటుంది.
జోన్-1లో 4,5,6 తరగతులు, మల్టీ జోన్ -2లో 7వ తరగతి చదివిన వారు మల్టీ జోన్ -1లోని పోస్టులకే పోటీపడాలి.
కొత్త స్థానికత వర్తింపు ఇలా..
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 7 తరగతుల్లో చివరి 4 ఏండ్లు (అంటే 4,5,6,7 తరగతులు) ఏ జిల్లాలో చదివితే వారు ఆ జిల్లాలో స్థానికులుగా పరిగణిస్తారు. వేర్వేరు జిల్లాల్లో చదువులు కొనసాగించిన వారి విషయంలో 4,5, 6,7 తరగతుల్లో 6,7 ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలోనే స్థానికులుగా పరిగణనలోకి తీసుకొంటారు.