నాగర్కర్నూల్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ పనులు ఆన్లైన్ కానున్నాయి. పనుల్లో పారదర్శకత పెంచేందుకు, సులువుగా పర్యవేక్షణ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టనున్నది. ఈ క్రమంలో తాజాగా కూలీల అటెండెన్స్ను సైతం ఆన్లైన్లో తీసుకునేందుకు ప్రత్యేక ఆన్లైన్ విధానాన్ని తీసుకురానున్నారు. ఇందుకోసం కేంద్రం ప్రత్యేకంగా నేషనల్ మోబైల్ మానిటరింగ్ యాప్(ఎన్ఎంఎంఎస్)ను అందుబాటులోకి తెచ్చింది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లు దీన్ని ఉపయోగించనున్నారు. ఈ పద్ధతిపై ఇప్పటికే అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లలో ఎన్ఎంఎంఎస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే ఆన్లైన్ మస్టర్ వస్తుంది. ఇందులో నమోదైన వివరాల మేరకు ఆ రోజు పనులకు వచ్చిన కూలీల హాజరును వేయనున్నారు. పనులు చేసే స్థలం నుంచే జియోట్యాగ్ చేసి ఆన్లైన్ హాజరు చేపట్టనున్నారు. దీనివల్ల లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్లో పనుల వివరాలు, కూలీల హాజరు నమోదు కానున్నది వ్యక్తిగత మరుగుదొడ్లు, పశువుల పాక, ఇంకుడు గుంతల్లాంటి వ్యక్తిగత ప్రయోజన పనులు, ప్రాజెక్టులకు ఈ నిబంధన వర్తించదు.
రోజుకు రెండుసార్లు హాజరు
కూలీల హాజరును రోజుకు రెండు సార్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం ఒకసారి ఆన్లైన్ హాజరు తర్వాత 4 గంటలకు మరోసారి ఇలా హాజరు వేయాలి. ఇంతకు ముందు ఇది 6 గంటల సమయం ఉండగా 2 గంటలను తగ్గించారు. ఇలా కూలీల హాజరు మరింత పకడ్బందీగా జరగనున్నది. ఈ కారణంగా గ్రామాల్లో కూలీల హాజరు నమోదులో తప్పు దొర్లేందుకు అవకాశం ఉండదు. ఫీల్డ్అసిస్టెంట్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదు. పనులు ప్రారంభించాక, పూర్తయ్యాక రెండుసార్లు గ్రూపుగా కూలీల ఫొటోలు తీసి యాప్లో అటెండెన్స్ వేస్తారు. దీంతో పనులకు హాజరైన కూలీల వివరాల్లో స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్ర, కేంద్ర రాజధానులు హైదరాబాద్, ఢిల్లీలో సైతం కార్యాలయాల్లోనే ఉంటూ అధికారులు కూలీల హాజరు, పనుల తీరును తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ జనవరి 1వ తేదీ నుంచి అమలు కానున్నది. అయితే దీనికి గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
మారుమూల, అటవీ ప్రాంతాల్లో సిగ్నల్ అందక అటెండెన్స్ నమోదులో ఆటంకాలు కలిగే అవకాశం ఉన్నది. ఈ సమస్య ఎదురైతే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు ఏపీవోలకు లిఖిత పూర్వకంగా సమాచారం అందిస్తే జిల్లా అధికారులు అనుమతించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో జాప్యం జరిగినా.. కూలీల అటెండెన్స్ నమోదులో ఇబ్బందులు కలుగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పనుల్లో భాగంగా చేసిన పనికి కొలతలు, పరిమాణం ప్రకారమే కూలి చెల్లిస్తుండగా ఈ కొత్త నిబంధన ఎందుకనే ప్రశ్నలు కూలీల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం కూలి పనుల్లో విధిస్తున్న నిబంధనలు పథకం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ కూలీలకు ఉపాధిని దూరం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో లైవ్ లొకేషన్లో మొబైల్ హాజరు మరింత ప్రతిబంధకంగా మారుతాయని వాపోతున్నారు.
కొత్త ఏడాది నుంచే ఆరంభం
ఉపాధి హామీ కూలీల అటెండెన్స్ జనవరి 1వ తేదీ నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా నమోదు చేస్తారు. పనులు జరుగుతున్న ప్రదేశం నుంచే ఫీల్డ్ అసిస్టెంట్లు లైవ్ లొకేషన్లో రోజుకు రెండుసార్లు అటెండెన్స్ తీసుకొని ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు. దీనివల్ల కూలీల హాజరు, పనుల్లో పారదర్శకత, పర్యవేక్షణ సులువుగా మానున్నది. సిగ్నల్స్ సమస్య ఎదురైతే ఏపీవోలకు సమాచారం అందిస్తే కూలీల హాజరు నమోదు చేపడుతాం. జిల్లాలో ఇప్పటి వరకు 2.06 లక్షల మంది కుటుంబాలకి జాబ్ కార్డులు ఇవ్వగా 1.14 లక్షల కుటుంబాల్లోని 2 లక్షల మంది ఉపాధి పనుల్లో చేస్తున్నారు.
– నర్సింగరావు, డీఆర్డీవో