సిటీబ్యూరో: మనోడు పంచ్ కొడితే పతకాలు దక్కాల్సిందే. బరిలోకి దిగాడంటే ప్రత్యర్థి బలాదూర్ అవ్వాల్సిందే. కుంగ్ఫూలో జనగామ కుర్రాడు బొలుగుల చందు అదుర్స్ అనిపిస్తున్నాడు. ఇటీవల నేపాల్ వేదికగా జరిగిన అంతర్జాతీయ కుంగ్ఫూ టోర్నీలో పసిడి పతకంతో మెరిశాడు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన చందును ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్లో దేశం గర్వించేలా సత్తాచాటాలంటూ మంత్రి భుజం తట్టారు. అయితే తొలుత నేపాల్ టోర్నీలో పాల్గొనేందుకు ప్రయాణ చార్జీలు లేక ఇబ్బంది పడ్డ చందుకు మంత్రి అండగా నిలిచారు. విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించి కావాల్సిన సాయం అందించారు.
కేటీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో పోటీకి దిగిన చందు స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. తనకు పతకం దక్కేందుకు మద్దతుగా నిలిచిన మంత్రికి చందు కృతజ్ఞతలు తెలిపాడు. ‘చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన నేను.. అంతర్జాతీయ టోర్నీలో సత్తాచాటాలన్న పట్టుదలతో ఉన్నా. కానీ నేపాల్ వెళ్లేందుకు సరిపడ డబ్బులు లేవు. నా కల చెదిరిందని నిరాశ చెందా. ఏమి చేయాలో తెలియలేదు. అంతలోనే కేటీఆర్ సర్కు విషయం తెలిసింది. క్షణాల్లో స్పందించి నాకు అండగా నిలిచారు. భవిష్యత్కు భరోసా ఇచ్చారు. జీవితంలో ఇది ఎప్పటికీ మరిచిపోను’ అని చందు చెప్పుకొచ్చాడు. చందు తండ్రి యాదగిరి ఆటో డ్రైవర్ కాగా.. తల్లి సునీత మక్కజొన్న కంకులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నది.