అమరావతి: ఈసారి గతంలో కంటే వరదలు ముందే వచ్చాయని దీంతో రాష్ట్రంలోని జలాశయాలు కళకళలాడుతున్నాయని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండిందని తెలిపారు. దీంతో డ్యాం గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశామని తెలిపారు. వరద బాధితులను పరామర్శించడానికి బాబు టీడీపీ జెండాలతో వెళ్తారా అని ప్రశ్నించారు.
వరద రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఆయన గోదావరి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని ఆరోపించారు. పరామర్శకంటే ప్రచారం కోసమే పర్యటిస్తున్నారని విమర్శించారు. పార్టీ జెండాలతో కలిసి పరామర్శించడానికి వెళ్లే దౌర్భాగ్య పరిస్థితి వారికి ఏర్పడిందని అన్నారు. టీడీపీ నాయకులు సేవా దృక్పదంతో వరద ప్రాంతాల్లో పర్యటించడం లేదని ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డిపై బురద చల్లడానికే వెళ్తున్నారని ఆరోపించారు.
పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం టీడీపీ ప్రభుత్వం చేసిన చారిత్రాతిక తప్పిదమని అన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎవరైనా నిర్మిస్తారా అని మరోసారి ప్రశ్నించారు.