ICC Champions Trophy | క్రికెట్లో టీ20లకు పెరుగుతున్న క్రేజ్, టెస్టులకు ఆయా బోర్డులు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా వన్డేల మనుగడే ప్రశ్నార్థకమవుతూ భవిష్యత్లో ఈ ఫార్మాట్ మనగలుగుతుందా? లేదా? అని చర్చోపచర్చలు సాగుతున్న వేళ 50 ఓవర్ల క్రికెట్ మజాను అందించడానికి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సిద్ధమైంది.
మూడు దశాబ్దాల విరామం తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీకి బుధవారం తెరలేవనుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 దాకా జరుగబోయే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భద్రతా కారణాల రీత్యా భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించదలిచినా పాక్లోని కరాచీ, లాహోర్, రావల్పిండిలో మ్యాచ్లు జరుగనున్నాయి. ప్రపంచ క్రికెట్లో ఐసీసీ టోర్నీ నిర్వహణకు సంబంధించి దాదాపుగా మునుపెన్నడూ జరగనన్ని చర్చలు, రెండు దేశాల బోర్డుల పట్టువిడుపులతో అసలు ఈ ఈవెంట్ జరుగుతుందా? లేదా? అన్న విఘ్నాలన్నింటినీ విజయవంతంగా అధిగమించిన చాంపియన్స్ ట్రోఫీని పాక్ ఏ మేరకు విజయవంతంగా నిర్వహిస్తుందనేది ఆసక్తికరం!
కరాచీ: ఎనిమిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు బుధవారంతో తెరపడనుంది. ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి బుధవారం నుంచి తెరలేవనుంది. 1996 తర్వాత పాకిస్థాన్లో జరుగుతున్న ఈ టోర్నీ నిర్వహణపై యావత్ దేశం భారీ అంచనాలే పెట్టుకుంది. 9వ ఎడిషన్గా జరుగబోయే ఈ టోర్నీని ఫిబ్రవరి 19 నుంచి మార్చి 09 దాకా పాకిస్థాన్, దుబాయ్లలో నిర్వహించనున్నారు. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై లాహోర్లో జరిగిన ఉగ్రమూకల దాడికి ఫలితంగా 15 ఏండ్ల పాటు స్వదేశంలో భారీ టోర్నీలకు దూరమై అనధికారిక శిక్షను అనుభవిస్తున్న పాకిస్థాన్ క్రికెట్కు ఆ మచ్చను తుడిపేసి ‘మా దేశం భద్రమే’ అని ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పడానికి దాయాదికి ఇది సువర్ణావకాశం. బుధవారం ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. టోర్నీకి ప్రత్యేక ఆకర్షణ అయిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఈనెల 23న దుబాయ్లో జరుగుతుంది. మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలవుతాయి.
వన్డేలలో ర్యాంకుల ఆధారంగా మొదటి 8 ర్యాంకులు కలిగిన దేశాలు ఆడనున్న ఈ టోర్నీలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, న్యూజిలాండ్ ఉండగా గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగబోయే ఈ టోర్నీలో భాగంగా గ్రూప్ దశ (మొత్తం 12 మ్యాచ్లు)లో ప్రతి జట్టు తమ గ్రూపులోని ఇతర జట్లతో ఒక మ్యాచ్ ఆడుతుంది. 19 నుంచి వచ్చే నెల 02 దాకా గ్రూప్ దశ మ్యాచ్లు జరుగనుండగా ఈ దశలో టాప్ -2లో నిలిచిన రెండు జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. దుబాయ్లో తొలి, లాహోర్లో రెండో సెమీస్ జరుగుతుంది. ఒకవేళ భారత్ ఫైనల్కు చేరితే టైటిల్ పోరు దుబాయ్లోనే జరుగుతుంది.
ఈ టోర్నీ టైటిల్ ఫేవరెట్లలో భారత్ ముందు వరుసలో ఉందనడంలో సందేహమే లేదు. ధోనీ సారథ్యంలో 2013లో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టు 2017 ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. పుష్కరకాలం విరామం తర్వాత ఈసారి టైటిల్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ బరిలో ఉంది. ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన రోహిత్ సేన.. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచింది. భారత్తో పాటు రెండుసార్లు విజేత అయిన ఆస్ట్రేలియా, ఆతిథ్య పాకిస్థాన్, మాజీ చాంపియన్ న్యూజిలాండ్, ఇంతవరకూ ట్రోఫీ నెగ్గని ఇంగ్లండ్ కూడా ఈ సారి పట్టు విడవకూడదనే కృతనిశ్చయంతో ఉన్నాయి. వన్డే ప్రపంచకప్లో సంచలన విజయాలు నమోదుచేసిన అఫ్గానిస్థాన్.. ఈ టోర్నీలో అగ్రశ్రేణి జట్లకు ఏ మేరకు షాకులిస్తుందో చూడాలి.
వన్డే పార్మాట్లో దిగ్గజాలుగా వెలుగొందుతున్న భారత సారథి రోహిత్ శర్మతో పాటు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి బహుశా ఇదే ఆఖరి ఐసీసీ వన్డే టోర్నీ! ఇప్పటికే కెరీర్ చరమాంకంలో ఉన్న ఈ ద్వయం 2027 వన్డే ప్రపంచకప్లో ఆడతారనుకోవడం అత్యాశే. ‘రోకో’ 2023 వన్డే ప్రపంచకప్తోనే ఈ ఫార్మాట్కు గుడ్బై చెబుతారని ఊహాగానాలు వినిపించినా ఆ టోర్నీ తుది మెట్టుపై భారత్ బోల్తా కొట్టడం వీరిని నిరాశపరిచింది. ఇటీవల కాలంలో వయసు, ఫామ్లేమితో సతమతమవుతున్నా స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో రాణించిన ఈ దిగ్గజాలు తమకు అచ్చొచ్చిన చాంపియన్స్ ట్రోఫీలో ఏం చేస్తారనేది ఆసక్తికరం. రోకోతో పాటు ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్, కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్, అఫ్గాన్ మాజీ సారథి మహ్మద్ నబీ వంటి క్రికెటర్లకు ఇదే చివరి వన్డే టోర్నీ కావొచ్చు!