మట్టి ఆటకు మకుటం పెట్టిన ప్రొ కబడ్డీ లీగ్లో.. ఒంటరి పోరాటానికి సమిష్టి సాయం తోడవడంతో దబంగ్ ఢిల్లీ విజేతగా నిలిచింది. గత సీజన్లో 22 ‘సూపర్-10’లు సాధించి భళా అనిపించుకున్నా.. జట్టుకు టైటిల్ దక్కకపోవడంతో మైదానంలోనే కన్నీళ్లు కార్చిన స్టార్ రైడర్ నవీన్ కుమార్.. ఈసారి తన టీమ్కు ట్రోఫీ కట్టబెట్టాడు. లీగ్ ఆసాంతం దుమ్మురేపిన నవీన్కు ఆఖరి పోరులో ఆల్రౌండర్ విజయ్ అండగా నిలువగా.. టోర్నీ మొత్తం తన ట్యాక్లింగ్స్తో కట్టిపడేసిన మహమ్మద్ రెజా చివరాటలో ఆకట్టుకోలేకపోవడంతో పట్నా పైరెట్స్ రన్నరప్తో సరిపెట్టుకుంది. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరు.. ఆటగాళ్లతో పాటు అభిమానులను ఊపేయగా.. తీవ్ర ఉత్కంఠలోనూ ఒత్తిడిని జయించిన ఢిల్లీకి టైటిల్ దక్కింది.
బెంగళూరు: గత సీజన్ తుది మెట్టుపై బోల్తా పడ్డ దబంగ్ ఢిల్లీ.. ఈ సారి ఆఖరి క్షణం వరకు పట్టు వదలకుండా పోరాడి విజేతగా నిలిచింది. శుక్రవారం తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ ఫైనల్లో ఢిల్లీ 37-36తో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరెట్స్పై అద్భుత విజయం సాధించింది. గతేడాది ఒంటరి పోరాటంతో ఢిల్లీని ఫైనల్కు చేర్చిన స్టార్ రైడర్ నవీన్ కుమార్ ఈ సారి జట్టును విజేతగా నిలుపడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి అర్ధభాగంలో కాస్త వెనుకబడ్డ ఢిల్లీ.. రెండో సగంలో విజృంభించింది. నవీన్ కుమార్ 13 పాయింట్లతో సత్తచాటగా.. ఆల్రౌండర్ విజయ్ 14 పాయింట్లు సాధించి ఢిల్లీ విజయానికి బాటలు వేశాడు. పట్నా తరఫున సచిన్ (10 పాయింట్లు), గుమాన్ సింగ్ (9 పాయింట్లు) రాణించినా.. స్టార్ ఢిపెండర్ మహమ్మద్ రెజా (5 పాయింట్లు) పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో పైరెట్స్కు ఓటమి తప్పలేదు. నవీన్ విషయంలో అతి జాగ్రత్తకు పోయిన పట్నా మూల్యం చెల్లించుకుంది. సీజన్ మొత్తం తన సూపర్ ట్యాక్లింగ్స్తో జట్టును ఒంటిచేత్తో గెలిపించిన ఇరాన్ డిఫెండర్ మహమ్మద్ రెజా కీలక పోరులో ఒత్తిడికి లోనవడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది.
బెస్ట్ రైడర్
పవన్ షెరావత్(304, బెంగళూరు) రూ.15 లక్షలు
బెస్ట్ డిఫెండర్
మహమ్మద్ రెజా (84, పట్నా)రూ.15 లక్షలు
యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ
మోహిత్ గోయత్(పుణేరి పల్టాన్) రూ.15 లక్షలు