మన్సూరాబాద్, నవంబర్ 21: ఫైనాన్స్లో తీసుకున్న బండికి ఈఎంఐలు కట్టలేకపోయాడు.. ఇష్టపడి కొనుకున్న బైక్ను ఫైనాన్సర్లు తీసుకెళ్తారేమోనని భయం ఆ యువకుడికి పట్టుకుంది.. ఎలాగైనా వాహనాన్ని కాపాడుకోవాలని.. చైన్స్నాచింగ్కు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటలాపాలయ్యాడు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం… ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలం, రావూరు గ్రామానికి చెందిన జివ్విగుంట శివప్రసాద్ అలియాస్ శివ (21) వనస్థలిపురం వెంకటరమణకాలనీలో నివాసముంటూ.. మేస్త్రి పనిచేస్తుంటాడు. కొన్ని నెలల కిందట రూ. 2.10 లక్షలతో బైకును కొనుగోలు చేశాడు. అయితే మూడు నెలల నుంచి ఈఎంఐలు కట్టడం లేదు. ఇష్టపడి తీసుకున్న బైకును ఫైనాన్సర్లు పట్టుకెళ్తారేమోననే ఆందోళన శివలో మొదలైంది.
బండిని కాపాడుకునేందుకు చైన్స్నాచింగ్లు చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్ చానళ్లను వీక్షించి.. స్నాచింగ్లు ఎలా చేయాలో తెలుసుకున్నాడు. తుల్జాభవానీనగర్లో తండ్రితో కలిసి మేస్త్రి పని కోసం ప్రతి రోజూ వెళ్లేవాడు. ఈ క్రమంలో అనుపమనగర్లో కిరాణషాపు నడుపుతున్న స్వప్న అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఈనెల 18న చెక్కీలు కావాలని అడిగి… ఆమె మెడలోని గొలుసు లాగబోయాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆరు గ్రాముల పుస్తెలను తెంపుకెళ్లాడు.
స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని శనివారం ఎల్బీనగర్ రింగ్రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. అలాగే దొంగలించిన పుస్తెలను కొనుగోలు చేసిన ఎఫ్సీఐ కాలనీకి చెందిన జ్యువెల్లరీ షాపు యజమాని చేతన్కుమార్ (48)ను కూడా పట్టుకున్నారు. వీరిద్దరిని అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రూ. 25వేలు విలువైన ఆరు గ్రాముల పుస్తెలు, రూ. 3వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.