వారు ధరించే ఆభరణాలపై స్నాచర్ల కన్ను
అవకాశం చూసి.. దోచుకుంటున్న వైనం
సైబరాబాద్ పరిధిలో ఐదు ఘటనలు
వృద్ధులను కంటకనిపెడుతుండాలంటున్న పోలీసులు
సిటీబ్యూరో, మార్చి 28: గట్టిగా అరవలేరు.. చూపు మందగించి ఉంటుంది..ఓపిక ఉండదు..ఎవరొచ్చారో అంతగా జ్ఞాపకం ఉండదు.. ఈ అంశాలే నేరస్తులకు పండుటాకులు టార్గెట్గా మారుతున్నారు. వారిని లక్ష్యంగా చేసుకొని..దోపిడీ పర్వాన్ని సాగిస్తున్నారు. ఇటీవల సైబరాబాద్ పరిధిలో చోటుచేసుకున్న ఐదు ఘటనల్లో బాధితుల వయసు 65 పైనే ఉన్నట్లు ఫిర్యాదులో నమోదైన వివరాలతో స్పష్టమైంది. ఆ వృద్ధులంతా తమను దోచుకున్న దొంగల ఆనవాలను సరిగా గుర్తుపట్టలేకపోయారు. దీంతో ఇప్పుడు ఈ కేసులు చాలా కీలకంగా మారాయి. నిందితులను పట్టుకునేందుకు సైబరాబాద్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ఐదు చోట్ల స్నాచింగ్లు..
సైబరాబాద్ పరిధిలోని మల్లంపేట, శంభీపూర్, బౌరంపేట్, జగద్గిరిగుట్ట, అల్వాల్ ప్రాంతాల్లో ఘటనలు జరిగాయి. సాయంత్రం సమయంలో వచ్చిన దుండగులు వృద్ధులను పలకరించి.. మెడలో ఉన్న బంగారం గొలుసులను తెంపుకొని పరారయ్యారు. వారెవరో.. కనీసం ఆనవాలు చెప్పేందుకు కూడా బాధితుల వద్ద మాటలు లేవు. ఆగంతకులు ఏమని అడిగారు… ఎలా వచ్చారనే ప్రశ్నలకు కూడా జవాబు లేదు. మరోవైపు ప్రతి ఘటన ఒకటి, రెండు అంతస్తులు ఉన్న భవనల్లోనే జరిగాయి. అందులో వృద్ధులు కింద అంతస్తులో ఒంటరిగా ఉంటుండగా, కుటుంబ సభ్యులు పై గదిలో ఉంటున్నారు. ఓ ఉదంతంలో దుండగులు కింది పోర్షన్లో ఉన్న వృద్ధురాలి తలుపును తట్టి పిలిచి.. గొలుసును లాక్కెళ్లిపోయారు.
వృద్ధులకు తోడుగా ఒకరిని పెట్టండి…
బహుళ అంతస్తుల భవనాల్లో కింది పోర్షన్లలో అధికంగా వృద్ధులను ఉంచుతున్నారు. వారికి ఎవరూ తోడుగా ఉండడం లేదు. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో వారి చెంతన ఒకరు ఉండేలా లేదా వారిని తరచూ గమనిస్తూ.. ఉండే విధంగా జాగ్రత్తలను తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలను ధరించే వృద్ధులను నిత్యం ఓ కంటకనిపెడుతుండాలని చెబుతున్నారు.