HomeNewsCentre Tightens Rules For Overseas Travellers Over Omicron Risk
విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త రూల్స్
న్యూఢిల్లీ, నవంబర్ 29: ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ముఖ్యంగా ఈ వేరియంట్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలుంటాయని తెలిపింది. ఆ నిబంధనలు..
విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఒక్క ప్రయాణికుడు తమకు కరోనా లేనట్టు స్వీయ ధ్రువీకరణ పత్రం, ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలి. రెండింట్లో ఏది లేకపోయినా దేశంలోకి అనుమతించరు.
ఒమిక్రాన్ వేరియంట్ నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియాకు వచ్చాక వారి రక్త నమూనాలను ఇవ్వాలి. ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేస్తారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే వెంటనే క్వారంటైన్కు పంపుతారు. ఆ నమూనాలను జన్యు విశ్లేషణ చేస్తారు. ఒక వేళ వారికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయితే కఠినమైన ఐసోలేషన్ ఉంటుంది.
ఈ వేరియంట్ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా కూడా వారు ఏడు రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి. 8వ రోజున మళ్లీ టెస్టు చేస్తారు.
మిగతా దేశాల ప్రయాణికుల నుంచి కూడా ర్యాండమ్గా నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ వస్తే జన్యు విశ్లేషణకు పంపిస్తారు.