కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 27: యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మొండి వైఖరిని అవలంబిస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నదన్నారు. రైతులు వెంటనే మేల్కొని లాభదాయక పంటల వైపు దృష్టిసారించాలని సూచించారు. కరీంనగర్ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఇన్నాళ్లు వరి పండించిన మంత్రి గంగుల.. ప్రస్తుతం ఆయిల్పామ్ సాగుకు సిద్ధమయ్యారు. వ్యవసాయ అధికారుల సలహాల మేరకు శనివారం ఆయిల్పామ్ సాగుకు అనువుగా భూమిని చదును చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ నేలలు అనువైనవన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు లోహియా కంపెనీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పారు. సదరు కంపెనీ ప్రతినిధులు రైతులకు సబ్సిడీపై మొకలు అందించడంతోపాటు పంట చివరలో గెలలు తీసుకునే వరకు అన్ని విధాలుగా అండగా ఉంటారని తెలిపారు. తొమ్మిది మీటర్లకు ఒక మొక చొప్పున ఎకరాకు దాదాపు 57 మొకలు పెడితే 10 టన్నుల దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. ఒక్కో టన్నుకు రూ.10 వేల ధర వచ్చే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. ఖర్చులు పోగా రైతుకు ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. దీనికితోడు అంతర పంటలుగా కూరగాయలు, పెసర, మినుము, కంది వంటి పప్పుదినుసులు కూడా సాగు చేసుకొని రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని మంత్రి గంగుల సూచించారు.
రైతుల పక్షాన నిలిచాం..
యాసంగిలో ధాన్యం కొనబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సమస్య నుంచి రైతాంగాన్ని గట్టెకించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి గంగుల తెలిపారు. వానకాలం కొనుగోళ్లపై కేంద్రం సృష్టమైన హామీ ఇవ్వకపోయినా తాము కొంటున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5,871 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రోజుకు లక్ష టన్నులకుపైగా ధాన్యం సేకరిస్తున్నట్టు వివరించారు. శుక్రవారం వరకు రాష్ట్రంలో 20.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు తెలిపారు. 3 లక్షల 27 వేల మంది రైతుల నుంచి రూ.3,925 కోట్ల విలువైన ధాన్యం సేకరించామని చెప్పారు.