చదువుకు సరైన ప్రాధాన్యం ఇవ్వని సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. దేశాన్ని విద్యారంగంలో అగ్రగామిగా నిలుపాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కృషిచేయాలి.
–విద్యావ్యవస్థపై స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2018 ఫిబ్రవరి 17న చేసిన వ్యాఖ్య ఇది.
మోదీ చెప్పిన మాట ప్రకారం ఇతర రాష్ర్టాలతో పాటు తెలంగాణలో కూడా విద్యాభివృద్ధికి, ప్రత్యేకించి ఉన్నత విద్యా సంస్థలు నెలకొల్పేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఎంతో చేసి ఉండాలి. కానీ, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థలను పరిశీలిస్తే దేశంలో ఏడేండ్లలో కొత్తగా 7 ఐఐఎంలు కేటాయిస్తే అందులో
తెలంగాణకు కేటాయించినవి సున్నా!
ఐఐటీలు 7 ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఇచ్చినవి సున్నా!
ఐఐఎస్ఈఆర్లు రెండు నెలకొల్పితే.. తెలంగాణలో నెలకొల్పినవి సున్నా!
ఐఐఐటీలు దేశవ్యాప్తంగా 16 ఏర్పాటు చేస్తే.. తెలంగాణలో ఏర్పాటుచేసినవి సున్న!
ఎన్ఐడీలు దేశంలో నాలుగు పెడితే.. తెలంగాణలో పెట్టినవి సున్నా!
వివిధ రాష్ర్టాల్లో మొత్తం 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలో ఏర్పాటు చేసినవి సున్నా!
నవోదయ పాఠశాలలు కొత్తగా 84 నెలకొల్పితే.. తెలంగాణలో సున్నా!
వీటిని తెప్పించేందుకు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు చేస్తున్న కృషి.. పెద్ద గుండు సున్నా!
కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న పాత్ర పోషించాలి. బీజేపీ ప్రభుత్వం అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో అన్నట్టు వ్యవహరిస్తున్నది. స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప, కేంద్రంలో అధికార పార్టీగా ఏనాడూ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు. విద్యాసంస్థల కేటాయింపులో ఏడేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని ఉదారంగా ఆదుకోవాలని.. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కేంద్రం పాలసీ ప్రకారం నవోదయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీలు, ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, ఎన్ఐడీ వంటి విద్యాసంస్థలు, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలని ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం వందలసార్లు విజ్ఞప్తి చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ మంజూరు చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
హైదరాబాద్, జనవరి 27 : జాతీయ విద్యావిధానం-1986ను ప్రవేశపెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా కనీసం ఒక్కో జిల్లాకు ఒక్కో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ పాలసీ ప్రకారం నవోదయలను నెలకొల్పుతూ వస్తున్నది. తెలంగాణలో 9 నవోదయ పాఠశాలలు ఉన్నాయి. పాలనా సంస్కరణల్లో భాగంగా జిల్లాలు 33కు పెరిగాయి. రాష్ర్టానికి అదనంగా 24 నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడేండ్లలో దేశవ్యాప్తంగా 84 నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. అందులో తెలంగాణకు ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. పేరుకు హైదరాబాద్ను ఒక రీజియన్గా పేర్కొంటున్నా.. రీజినల్ కేంద్రానికి ఇవ్వాల్సిన కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదు. హైదరాబాద్ రీజియన్లోని పెద్ద రాష్ర్టాలన్నింటిలో తెలంగాణ కన్నా ఎక్కువ విద్యాసంస్థలు ఉన్నాయి. ఏపీలో 15, కేరళలో 14 ఉంటే.. కర్ణాటకలో ఏకంగా 31 నవోదయలు ఉన్నాయి. ఈశాన్య రాష్ర్టాలైన మేఘాలయ (12), నాగాలాండ్ (11), మణిపూర్ (11) కన్నా తెలంగాణ వెనుకబడి ఉన్నది. జమ్ముకశ్మీర్లో ఏకంగా 23 ఉన్నాయి. తెలంగాణ కన్నా చిన్నగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న అనేక రాష్ర్టాలకు ఎక్కువ సంఖ్యలో నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.
ఐఐటీ ఇవ్వడానికి మనసు రాలేదు
2014 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏడు ఐఐటీలను ప్రారంభించింది. పాలక్కాడ్ (కేరళ), తిరుపతి (ఏపీ), ధన్బాద్ (జార్ఖండ్), భిలాయ్ (ఛత్తీస్గఢ్), గోవా (గోవా), జమ్ము (జమ్ముకశ్మీర్), ధార్వాడ్ (కర్ణాటక)లో నూతనంగా ఐఐటీలను ఏర్పాటుచేసింది. ఈ ఏడేండ్లలో తెలంగాణ ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా పట్టించుకోలేదు.
మెడికల్ కాలేజీల్లోనూ తీరని అన్యాయం
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదు. రాష్ర్టానికి మెడికల్ కాలేజీలు మంజూరుచేయాలంటూ ఆరేండ్లుగా ఢిల్లీలో కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదు. మెడికల్ కాలేజీలను సైతం బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నది. యూపీకి ఏకంగా 26 కాలేజీలు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. రాజస్థాన్కు 23, మధ్యప్రదేశ్కు 12, తమిళనాడుకు 11 కేటాయించింది. తాను బలపడాలని భావించిన పశ్చిమబెంగాల్కు 12 ఇచ్చింది. కేంద్రం ఇచ్చేలా లేదని, తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎలాగూ తెచ్చేలా లేరని రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే.. కేంద్రంతో సంబం ధం లేకుండా సొంతంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే నాలుగు మెడికల్ కాలేజీలను ప్రారంభించగా.. మరో 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో కాలేజీకి దాదాపు రూ.500 కోట్లు వ్యయం చేస్తున్నారు. వీటికి అదనంగా హైదరాబాద్ నగరానికి నలువైపులా టిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, వరంగల్లో హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు.
నిడ్… మాకు ఇవ్వరా?
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (నిడ్) ఏర్పాటులోనూ తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నది. గడిచిన ఏడేండ్లలో కేంద్రం నాలుగు నిడ్లను నెలకొల్పింది. జోర్హాట్ (అస్సాం), విజయవాడ (ఏపీ), భోపాల్ (మధ్యప్రదేశ్), కురుక్షేత్ర (హర్యానా)కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ను కేటాయించింది. వీటిని అత్యంత జాతీయ ప్రాముఖ్యమైన (నేషనల్ ఇంపార్టెన్స్) విద్యాసంస్థల జాబితాలో చేర్చింది. కానీ తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా కేటాయించలేదు.
ఐఐఎం ఎక్కడ?
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ను రాష్ర్టానికి తీసుకురావాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లుగా చేయని ప్రయత్నమే లేదు. ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడేండ్లలో ఏడు ఐఐఎంలను ప్రారంభించింది. అమృత్సర్ (పంజాబ్), బోధ్గయ (బీహార్), నాగపూర్ (మహారాష్ట్ర), సిర్మౌర్ (హిమాచల్ప్రదేశ్), సంభల్పూర్ (ఒడిశా), విశాఖపట్నం (ఏపీ), జమ్ము (జమ్ముకశ్మీర్)లో ఏర్పాటు చేసింది. ఇవన్నీ ఎన్డీఏ తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంజూరు చేసినవే. 2019 డిసెంబర్ 2న లోక్సభలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్వయంగా కొత్త ఐఐఎంలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. అంటే.. తెలంగాణకు శాశ్వంగా అన్యాయం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నది.
సైన్స్లోనూ వివక్షే..
పారిశ్రామికపరంగా దేశంలో తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి ఐటీ, బయో, ఫార్మా రంగాలు. ఐఐఐటీలను మంజూరు చేయకుండా ఐటీ రంగంలో అన్యాయం చేసిన కేంద్రప్రభుత్వం.. సైన్స్లోనూ అన్యాయం చేసింది. గొప్ప ఆవిష్కరణలతో ప్రంపచాన్ని అబ్బురపరుస్తున్న తెలంగాణకు కనీసం ఒక్క ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్)ను కేటాయించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం 2015లో ఏపీలోని తిరుపతిలో, 2016లో ఒడిశాలోని బెర్హంపూర్లో ఐఐఎస్ఈఆర్లను ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణను చిన్నచూపు చూస్తున్నది. సైన్స్ రంగంలో తెలంగాణ అద్భుతం అంటూ ప్రశంసలే తప్ప, విద్యాసంస్థలను కేటాయించిన దాఖలాలు లేవు.
ఏడేండ్లలో 16 ఐఐఐటీలు తెలంగాణకు 0
ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలన్నీ తెలంగాణలో కార్యకలాపాలను ప్రారంభించాయి. పరిశ్రమ అవసరాలు తీరేలా.. తెలంగాణ యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఐఐఐటీ నెలకొల్పాలని ప్రభుత్వం ఏడేండ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నది. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈ ఏడేండ్లలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 16 ఐఐఐటీలను నెలకొల్పింది. ఇందులో ఒక్కటీ తెలంగాణకు కేటాయించలేదు. ఐఐఐటీలను పీపీఈ పద్ధతిలో నెలకొల్పాలని 2010లో కేంద్రం నిర్ణయించింది. కనీసం ఈ పద్ధతిలోనైనా తెలంగాణలో ఒకటి నెలకొల్పాని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. దీనికి ‘సీఎం కేసీఆర్ నుంచి లేఖ అందింది. ఆయన కోరినట్టుగా కరీంనగర్లో ఐఐఐటీని నెలకొల్పే అవకాశం లేదు’ అని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ పార్కర్ గతేడాది రాజ్యసభలో స్పష్టంచేశారు. కరీంనగర్లో ఐఐఐటీ ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం ఏడేండ్లుగా కేంద్రాన్ని కోరుతుంటే.. ఆ జిల్లా ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి రాజకీయాలే తప్ప ఐఐఐటీ కోసం పోరాడాలన్న సోయేలేదు.
రాష్ర్టాల వారీగా నవోదయ విద్యాసంస్థల జాబితా
ఛత్తీస్గఢ్ (28), మధ్యప్రదేశ్ (54), ఒడిశా (31), చండీగఢ్ (1), హిమాచల్ప్రదేశ్ (12), జమ్ముకశ్మీర్ (23), పంజాబ్ (23), అండమాన్ నికోబార్ (3), ఆంధ్రప్రదేశ్ (15), కర్ణాటక (31), కేరళ (14), లక్షద్వీప్ (1), పాండిచ్చేరి (4), తెలంగాణ (9), ఢిల్లీ (9), హర్యానా (21), రాజస్థాన్ (35), ఉత్తరాఖండ్ (13), ఉత్తరప్రదేశ్ (76), బీహార్ (39), జార్ఖండ్ (26), పశ్చిమబెంగాల్ (20), దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూ (1+2), గోవా (2), గుజరాత్ (34), మహారాష్ట్ర (34), అరుణాచల్ప్రదేశ్ (18), అస్సాం (28), మణిపూర్ (11), మేఘాలయ (12), మిజోరం (8), నాగాలాండ్ (11), సిక్కిం (4), త్రిపుర (8).
రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?
తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఢిల్లీలో మాకు పరపతి ఉన్నదని, పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయంటూ గప్పాలు కొట్టడం తప్ప ఒక్క విద్యాసంస్థను కూడా సాధించలేదు. బండి సంజయ్ స్వయంగా కరీంనగర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలో ఐఐఐటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంటే.. తోడుగా రావాల్సిందిపోయి నాకేం సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మిగతా ఎంపీలదీ అదే పరిస్థితి. నవోదయలు ఎందుకు తేలేదంటే చప్పుడు చేయరు. ఐఐటీ, ఐఐఎం గురించి కనీసం మాట్లాడరు. మెడికల్ కాలేజీల ఏర్పాటులో అన్యాయం జరుగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తే.. రాష్ట్రంపైనే నిందలు వేసేందుకు ప్రయత్నిస్తారు. నిధులు, ప్రాజెక్టులు ఎలాగూ తీసుకురాలేరు.. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను అమలుచేయించడం ఎలాగూ చేతగాదు.. కనీసం తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు విద్యాసంస్థలు తెచ్చి ఆ రుణం తీర్చుకోవాలన్న సోయి కూడా లేకుండా నిస్సిగ్గుగా రోడ్ల మీద తిరుగుతున్నారు.
మరి ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు విద్యాసంస్థలు తెస్తారా? మోదీ ఇస్తారా?