హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): వరి రైతుల విషయంలో బాధ్యతనుంచి తప్పించుకొంటున్నదెవరు? కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్లే కదా.. వరి రైతుల పరిస్థితి ఇవాళ అగమ్యగోచరంగా మారింది! ధాన్యం సేకరణపై విముఖత వ్యక్తంచేయడం ద్వారా రైతుల పట్ల కేంద్రం బాధ్యతారాహిత్యం ఏమిటో తెలియడం లేదా? వ్యవసాయంపైనా.. పంట దిగుబడులపైనా.. ధాన్యం సేకరణపైనా.. వాటి వినియోగం పైనా కేంద్రానికి ఒక స్పష్టమైన విధానమన్నది లేనేలేదు. ఏ యేటికాయేడు ప్రభుత్వం సేకరించే ధాన్యాన్ని పీడీఎస్ ద్వారా పంపిణీతోపాటుగా.. ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వినియోగంలోకి తేవడం, విదేశాలకు ఎగుమతి వం టి ఎన్నో చర్యలు చేపట్టవచ్చు. కానీ.. అలాంటి పనులేవీ చేయకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
పెట్రోలియం ఉత్పత్తుల్లో 20% ఇథనాల్ను మిక్స్ చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. కానీ.. ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటుపై ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. బియ్యం, నూకలు, మక్కల నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేయవచ్చు. టన్ను బియ్యంతో 450 లీటర్లు, టన్ను నూకలతో 400 లీటర్లు, టన్ను మక్కలతో 380 లీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేయవచ్చు. కానీ కేంద్రం దగ్గర ఇందుకు సంబంధించి సరిరైన విధానమంటూ లేనేలేదు. తగినన్ని ప్రోత్సాహకాలు, సబ్సిడీలు లేక ప్లాంట్ల ఏర్పాటు కు వ్యాపారులెవరూ ముందుకు రావడంలేదు.
ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటుచేయడం ద్వారా ధాన్యం నుంచి వందల రకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయించొచ్చు. కానీ ఫుడ్ ప్రాసెసింగ్ పట్ల కేంద్రానికి స్పష్టత లేదు. తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ల ఏర్పాటుకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకొన్నది. టెండర్లను ఆహ్వానించింది. రైస్ మిల్లులతో పాటు ఇతర ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు చు రుకుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఫుడ్ ప్రాసెసింగ్కు పెద్దపీట వేయగా.. మన దేశంలోనే, కేంద్రమే ఈ దిశగా కార్యాచరణ చేపట్టకపోవడం దారుణం. వ్యవసాయ ప్రధానమైన దేశంలో ఆహారోత్పత్తుల పరిశ్రమలకు ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తే.. దేశంలో పండించే ధాన్యం ఎంతైనా సరిపోకపోవచ్చని నిపుణుల అభిప్రాయం.
విదేశాలకు బియ్యం ఎగుమతి విషయంలోనూ కేంద్రం సరైన విధానం అనుసరించడంలేదు. రైస్ ఎక్స్పోర్ట్కు సంబంధించి అంతర్జాతీయ ధరకు, ఇక్కడి మద్దతు ధరకు మధ్య గల స్వల్ప వ్యత్యాసాన్ని ప్రభుత్వాలు భరించగలిగితే దేశంలో పండే 50 శాతానికిపైగా దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ప్రకటించారు. కానీ కేంద్రం నుంచి సమాధానం రాకపోవడం గమనార్హం. తెలంగాణ నుంచి సుమారు 5 మిలియన్ టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతికి అవకాశమున్నది.