కరీంనగర్ : ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పచ్చని తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో మంగళవారం పలు అభివృద్ధి పనులను నగర మేయర్ వై.సునీల్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని ఆడిటోరియంలో కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు చెందిన 129 మందికి రూ.1.29 కోట్ల కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ నిరుపేదల కోసం ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రకటించలేకపోయారని విమర్శించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా తెలంగాణలోని సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టని బీజేపీ పాలకులు తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తెస్తామంటున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నాయకులు తెలంగాణను తిరిగి ఆంధ్రప్రదేశ్లో కలుపుతామని మాట్లాడుతున్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ ఒక వ్యక్తి కాదని, తెలంగాణ ప్రజలు తయారు చేసుకున్న ఆయుధమని పేర్కొన్నారు. కరోనా కాలంలో సైతం సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించాలని కోరారు.
అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడాలని అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్రావు, ఎంపీపీ లక్ష్మయ్య, కార్పొరేటర్లు బండారి వేణు, ఐలేందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.