CBSE | ఇక నుంచి సీబీఎస్ఈలో పదో తరగతి, ఇంటర్ చదివే విద్యార్థులకు ఏడాదిలో రెండు సార్లు పరీక్షల నిర్వహణకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలుకు వ్యూహ రచన చేయాలని సీబీఎస్ఈని కేంద్ర విద్యాశాఖ కోరినట్లు సమాచారం. ఈ పరీక్షల్లో సెమిస్టర్ విధానాన్ని తెచ్చే ఆలోచన లేదని వినికిడి. ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై వచ్చేనెలలో ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లతో సీబీఎస్ఈ అధికారులు సంప్రదిస్తారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ల షెడ్యూల్ మీద ఎటువంటి ప్రభావం పడకుండా రెండోసారి బోర్డు పరీక్షల నిర్వహణకు అకడమిక్ క్యాలండర్ సిద్ధం చేసే పనిలో సీబీఎస్ఈ అధికారులు నిమగ్నమయ్యారని తెలుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సీబీఎస్ఈ పరీక్షల్లో మార్పులు తేవాలని ఇస్రో మాజీ చైర్మన్ కే కస్తూరి రంగన్ సారథ్యంలోని నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ముసాయిదా కమిటీ సూచించింది. 11,12 తరగతుల విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్నీ ప్రతిపాదించింది. అయితే, విద్యార్థులు ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జాతీయస్థాయి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే 10వ, 12వ తరగతి విద్యార్థులు ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని, విద్యార్థులు తాము సాధించిన ఉత్తమ స్కోర్ ఎంచుకోవచ్చునన్నారు.