హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): నైరుతి రైల్వేస్ (సౌత్ ఈస్ట్రన్) బెంగళూరులో పనిచేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కాంట్రాక్టర్ల నుంచి రూ.1.29 కోట్లు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు సదరు అధికారి బ్యాంక్ఖాతాలు, కుటుంబ సభ్యులు బ్యాంక్ ఖాతాలు, ఇతర ఆస్తులపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలతోపాటు బెంగళూరు, హుబ్లి, మైసూర్, సాంగ్లి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు వారు వెల్లడించారు.