హైదరాబాద్, జనవరి 27 : ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు, పిల్లలకు ఎంతో ఇష్టమైన ‘డుంబు’ సృష్టికర్త బుజ్జాయి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. బుజ్జాయి అసలు పేరు సుబ్బరాయశాస్త్రి.. కానీ తెలుగు పాఠకులకు బుజ్జాయిగానే సుపరిచితులు. తమిళపాఠకులు ఆయన్ను ‘పుచ్చాయి’గా గుర్తించారు. బుజ్జాయి.. ప్రఖ్యాత తెలుగు కవి.. దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు. 1960లో ఆంధ్రజ్యోతి దినపత్రికను నార్ల వెంకటేశ్వర్రావు ప్రారంభించినప్పుడు మొదటిరోజు నుంచే బుజ్జాయి తెలుగులో తొలి స్ట్రిప్ కార్టూన్ వేసేవారు. ఏఎస్ రామన్ ఎడిటర్గా ఉండగా ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో పంచతంత్ర కథలు ధారావాహికంగా రెండేండ్లపాటు కొనసాగించారు. డుంబు పాత్ర ఆయన సృష్టి.