సిటీబ్యూరో, జనవరి 8(నమస్తే తెలంగాణ): ఒమిక్రాన్ భయాందోళనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సైబర్ నేరగాళ్లు కాచుకొని కూర్చున్నారు. వైరస్ కొరలు చాచుతున్న వేళ.. దోచుకునేందుకు కొత్త ఎత్తుగడలకు ప్రయత్నిస్తున్నారు. ఒక వైపు ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో చాలా మంది బూస్టర్ డోసు వేసుకోవాలనే తొందర్లో ఉన్నారు. ఈ క్రమంలో తమ ఫోన్లకు వచ్చే సందేశాలు, కాల్స్కు వేగంగా స్పందించే అవకాశం ఉంది. తమ వద్ద టీకా అందుబాటులో ఉంది.. మీరు ఒమిక్రాన్ నుంచి బయటపడాలంటే.. మా దగ్గర రిజిస్టర్ చేసుకోండని ఎవరైనా చెబితే నమ్మెయవచ్చు. ఈ నేపథ్యంలో సైబర్ మాయగాళ్లు తెగబడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
మోసం చేస్తారిలా..
కొవిడ్-19 బూస్టర్ డోసు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ వాట్సాప్ కాల్స్ , ఈ- మెయిల్స్, ఫోన్ కాల్స్, మెసేజ్లతో లింక్లు పంపిస్తారు.
బూస్టర్ డోసు కోసం రిజిస్ట్రేషన్ తేదీని ఖరారు చేసుకోండని నమ్మిస్తారు.
ఓటీపీ చెప్పగానే మీ ఆధార్ కార్డులతో పాటు బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను సేకరిస్తారు.
ఆ తర్వాత మీ ఖాతాలు ఖాళీ చేస్తారు.
అప్రమత్తంగా ఉండాలిలా..
పౌరులందరూ టీకా వివరాల కోసం https: //www.cowin.gov.in వెబ్సైటును పరిశీలించాలి. ప్రభుత్వ దవాఖానలో వివరాలను తెలుసుకోవాలి. ప్రభుత్వం సూచించిన అధికారిక కార్యాలయాల్లో వాటిని పరిశీలించుకోవాలి. వ్యాక్సిన్కు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వ వెబ్సైట్లలో మాత్రమే ఉంటుంది.
టీకాల నమోదు ఇతర అంశాలకు సంబంధించి ఎవరు కూడా ఓటీపీలు, పిన్ నంబరు, బ్యాంక్ ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను అడుగరు.
బూస్టర్ డోసుకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్లు, మెసేజ్లు, ఈ మెయిల్స్ను పట్టించుకోవద్దు. ఇతరులకు షేర్ చేయొద్దు.
నాలుగు ప్రశ్నలు వేయండి
బూస్టర్ డోసు వేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సందేశాలు, ఫోన్లు, ఈమెయిల్స్ వచ్చినా వాటిని నమ్మొద్దు. వారికి ఎదురుగా నాలుగు ప్రశ్నలు వేయండి. మీకు నా నంబర్ ఎవరిచ్చారు. ప్రభుత్వం అనుమతి ఉందా.. రిజిస్టర్ చేసుకోవడానికి ఓటీపీ, పిన్ నంబర్లు, బ్యాంక్ వివరాలు ఎందుకని అడగాలి. బూస్టర్ డోసు అందుబాటులోకి వస్తే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి వేస్తామని అడిగినా వారి ఐడీని ధ్రువీకరించుకోవాలి.