బంజారాహిల్స్, జనవరి 25: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ డివిజన్లలోని బస్తీ దవాఖానల్లో ప్రజలకు అందుతున్న సేవలను జిల్లా వైద్యశాఖాధికారి డా.వెంకట్ మంగళవారం తనిఖీలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని ఎన్బీనగర్లో ఉన్న బస్తీ దవాఖానలో విధుల్లో డాక్టర్ లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వాక్సినేషన్ ప్రక్రియతో పాటు కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. సమాచారం లేకుండా ఎవరూ గైర్హాజరు కావద్దన్నారు.
ఫ్రంట్లైన్ వారియర్స్కు కరోనా సెగ
కరోనా నియంత్రణకు అలుపెరుగకుండా సేవలందిస్తున్న వైద్య సిబ్బందితోపాటు పోలీసులు ఆ మహమ్మారి బారినపడుతున్నారు. ఒకవైపు కొవిడ్ పరీక్షలు, మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వైద్య సిబ్బందికి కరోనా సెగ తగిలింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో పనిచేస్తున్న వారిలో సుమారు 20 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో వారంతా హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్లోని జూబ్లీహిల్స్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డా.అమీర్ ఇప్పటికే కరోనా బారినపడి హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. షౌకత్నగర్లో పనిచేస్తున్న పదిమందిలో ఐదుగురు కొవిడ్ బారినపడ్డారు. దీంతో వైద్య సేవలు, ఫీవర్ సర్వేకు అంతరాయం ఏర్పడింది.
బంజారాహిల్స్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.సీమా రెహ్మాన్ కూడా కరోనా బారిన పడి హోమ్ ఐసొలేషన్లోకి వెళ్లారు. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్లోని బస్తీ దవాఖానలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిలో ఇద్దరికి పాజిటివ్ రావడంతో ప్రైవేటు ఆస్పత్రికి చెందిన సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారు. వైద్య సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న పలువురు కూడా కరోనా బారినపడడంతో ఫీవర్ సర్వేలో పాల్గొనలేకపోతున్నారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న 12మంది సిబ్బందితోపాటు ఎస్ఐకి పాజిటివ్గా తేలడంతో హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. రోజువారీ కేసుల్లో కొంతమేర తగ్గుదల కనిపిస్తున్నా, ఫ్రంట్లైన్ వారియర్ మాత్రం కొవిడ్ బారినపడుతున్నారు.
69 పాజిటివ్ కేసులు
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 69మందికి పాజిటివ్గా తేలింది. బంజారాహిల్స్, చింతల్బస్తి, షౌకత్నగర్, ఫిలింనగర్, పంజాగుట్ట ఆరోగ్యకేంద్రాల పరిధిలో 626మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 69మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో కరోనా తగ్గుముఖం పడుతున్నదని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హిమాయత్నగర్లో..
హిమాయత్నగర్, జనవరి25: ఒమిక్రాన్, కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని హిమాయత్నగర్ కార్పొరేటర్ జీ.మహాలక్ష్మి సూచించారు. మంగళవారం నారాయణగూడలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జి.రామన్గౌడ్, నాయకులు నర్సింగ్గౌడ్, మహేశ్ పాల్గొన్నారు.