ఘట్కేసర్రూరల్, డిసెంబర్ 9: కుక్కను తప్పించబోయిన కారు పల్టీలు కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చౌదరిగూడ పంచాయతీ మక్తా గ్రామంలో జరిగింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు కథనం ప్రకారం.. విద్యార్థులైన అఖిల్ (19), విశాల్(15), షఫీ(19), సురేశ్(19)మిత్రులు. బుధవారం కొర్రెములలో జరిగిన తమ మిత్రుడి చెల్లెలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రతాపసింగారం చౌరస్తా నుంచి కొర్రెములకు ఇన్నోవా కారులో బయలుదేరారు. మక్తాలోని అయిమాత ఆలయం వద్ద కుక్క అడ్డుగా రావడంతో డ్రైవింగ్ చేస్తున్న షఫి దాన్ని తప్పించబోయే క్రమంలో వాహనం కల్వర్టుతో పాటు కర్ర మొద్దులను ఢీకొట్టి..పల్టీలు కొట్టడంతో వెనుకాల కూర్చున్న అఖిల్ అక్కడికక్కడే మృతిచెందగా, విశాల్కు తీవ్ర గాయాలయ్యాయి. బెలూన్లు తెరుచుకోవడంతో షఫి, సురేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.