‘ఓ సినిమా చేసేముందు కమర్షియల్గా ఏ స్థాయికి చేరుకుంటుంది? ఏ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే లెక్కలు వేసుకుంటా. కానీ ఈ కథ విన్నప్పుడు ఆ ప్రామాణికాలేవి గుర్తురాలేదు’ అని అన్నారు శివకందుకూరి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గమనం’. సుజనారావు దర్శకురాలు. ఈ నెల 10న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్లో శివ కందుకూరి పాత్రికేయులతో ముచ్చటిస్తూ “గమనం’ నా కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. అలీ అనే క్రికెటర్గా ఈ సినిమాలో కనిపిస్తా. తన కలల సాధన కోసం అతడు సాగించే ప్రయాణం సహజంగా ఉంటుంది. తన తప్పుల్ని సరిదిద్దుకుంటూ లక్ష్యసాధనవైపు అలీ ఎలా ప్రయాణించాడన్నది ఆకట్టుకుంటుంది. క్రికెటర్ పాత్ర కోసం రెండు నెలలు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. మంచి సినిమా చూసిన ఫీలింగ్తో ప్రతి ఒక్కరూ థియేటర్నుంచి బయట అడుగుపెడతారు. ఓ సినిమాను అంగీకరించే ముందు నాన్న రాజ్ కందుకూరి సలహాలు తీసుకుంటా. కానీ అంతిమనిర్ణయం మాత్రం నాదే. కథలోని పాత్రలు, ఎమోషన్స్తో నటీనటులు కనెక్ట్ అవ్వకపోతే ఆ సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించలేవని నమ్ముతా. ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ సినిమాలు ఎంచుకుంటున్నా. సంఖ్య కంటే మంచి కథలకే ప్రాధాన్యతనిస్తున్నా. పదేళ్లలో ఐదు గుర్తుండిపోయే సినిమాలు చేసినా చాలనుకుంటున్నా. ప్రస్తుతం నేను హీరోగా న టించిన ‘మనుచరిత్ర’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంటెన్స్ లవ్స్టోరీగా తెరకెక్కబోతున్నది. హీరో నాని నిర్మాణంలో ‘మీట్క్యూట్’లో నటిస్తున్నా. అలాగే మరో రెండు సినిమాలు చేయబోతున్నా’ అని తెలిపారు.