‘కంగ్రాట్స్! తల్లివి కాబోతున్నావు’ ఏ మహిళకైనా తీపి కబురే. ఆ మాట వెనకాలే మరో తూటా.. ‘కా..నీ.. క్యాన్సర్ లక్షణాలున్నాయి మీకు’ వైద్యులు చెప్పగానే కాబోయే తల్లి కన్నీటి పర్యంతం అవుతుంది. పాతాళంలో కూరుకుపోతున్న భావన కలుగుతుంది. ఆమె ముందు.. రెండు పెనుసవాళ్లు. తాను బతకాలి, కడుపులోని బిడ్డనూ బతికించుకోవాలి. నెలలు నిండే వరకూ దినదినగండమే. ఈ పరిస్థితుల్లో ఆధునిక వైద్య విధానాలు తల్లీబిడ్డలకు భరోసా ఇస్తున్నాయి.
ప్రణాళిక ముఖ్యం
గర్భధారణకు ముందే క్యాన్సర్ ఉన్నట్టు తేలితే లైంగిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. క్యాన్సర్ చికిత్స పూర్తయ్యే వరకు గర్భనిరోధక పద్ధతులు అనుసరించాలి. అయినా కూడా గర్భం వస్తే రెండేదారులు.. ఒకటి, అబార్షన్కు వెళ్లడం. రెండు, చికిత్సను మూడు నెలలు ఆపేయడం. ఎందుకంటే, మొదటి త్రైమాసికంలో కీమో థెరపీ చేయకూడదు. చికిత్స జరుగుతున్నప్పుడే కాదు, తర్వాత కూడా కొంతకాలం పిల్లల కోసం ప్రయత్నించక పోవడమే ఉత్తమం. కచ్చితంగా రెండేండ్ల నుంచి ఐదేండ్లపాటు ఆగాలి. అయితే 35-38 ఏండ్ల మహిళలకు వయసు పెరుగుతుండటం వల్ల.. అన్నేండ్లు మాతృత్వాన్ని వాయిదా వేయడం సాంకేతికంగా ఇబ్బందికరమే. అలాంటివారు, కనీసం ఆరు నెలలైనా ఆగాలి. క్యాన్సర్ తగ్గిపోయాక గర్భం దాలిస్తే, మళ్లీ వ్యాధి తిరగబడుతుందన్న వాదన నిజంకాదు. అపోహ మాత్రమే.
క్యాన్సర్ మహమ్మారి మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది. అందులోనూ, మహిళలకు మాత్రమే వచ్చే ఆస్కారం ఉన్న క్యాన్సర్లు అనేకం. కొన్ని, సరిగ్గా గర్భధారణ సమయంలోనే బయట పడతాయి. అనుకోకుండా, క్యాన్సర్ చికిత్స సమయంలో గర్భం ధరిస్తారు కొందరు. తనను తాను కాపాడుకునే పోరాటం ఒకవైపు, బిడ్డను కాపాడుకోవాలన్న ఆరాటం మరోవైపు. కాబోయే తల్లికి అదో కఠిన పరీక్షే. రుగ్మతపై అవగాహన, ముందస్తు పరీక్షలు, వైద్యుల సలహాలు.. ఈ మూడూ రక్షణ కవచాలై పెద్ద ప్రాణాన్ని కాపాడుతాయి, చిన్న ప్రాణాన్నీ నిలబెడతాయి.
గర్భధారణ గండాలు
గర్భం దాల్చడం వల్లే క్యాన్సర్ రావడం అంటూ ఉండదు. అయితే, మామూలు సమయాల్లో తమ శరీరంలో వచ్చే చిన్నచిన్న మార్పులను చాలామంది పట్టించుకోరు. అదే గర్భధారణ సమయంలో అయితే, ముందు జాగ్రత్తగా వైద్యులు అనేక పరీక్షలు చేస్తారు. అప్పుడే, క్యాన్సర్ లక్షణాలు
బయటపడతాయి. గర్భం నిర్ధారణ అయ్యాక.. ‘జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ నియోప్లాసియా’ అనే అరుదైన సమస్యలను కొంతమందిలో చూస్తుంటాం. అందులో ఒకటి మోలార్ ప్రెగ్నెన్సీ. దీన్నే పూర్వం ‘బల్ల’ అనేవాళ్లు. ఇది క్యాన్సర్ గడ్డ కానేకాదు. అలాగే, ‘ఇన్వేసివ్ మోల్’ అని కూడా ఉంటుంది. ఇదీ క్యాన్సర్ కాదు. అయితే, ‘కోరియో కార్సినోమా’ అనేది మాత్రం కచ్చితంగా క్యాన్సరే. వెంటనే కీమో థెరపీ ప్రారంభించాలి. అవసరమైతే రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ‘జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్’ అనేది గర్భం కానేకాదు. కడుపులో పిండం ఏర్పడే సమస్యే లేదు. కానీ గర్భంలా అనిపిస్తుంది. గర్భనిర్ధారణ పరీక్షలోనూ పాజిటివ్ వస్తుంది. దీన్ని నిపుణులు మాత్రమే గుర్తించగలరు.
అన్నీ పరీక్షించాకే..
గర్భధారణ సమయంలో రకరకాల క్యాన్సర్లు బయటపడే ప్రమాదం ఉంది. వైద్యుల దగ్గరికి వెళ్లగానే ముందుగా రొమ్ములను పరిశీలిస్తారు. గడ్డలు ఉన్నట్టు అనిపిస్తే పరీక్షలు చేసి, అది క్యాన్సరో, కాదో నిర్ధారిస్తారు. అయినా కొన్నిసార్లు పూర్తిస్థాయిలో క్యాన్సర్ను గుర్తించడం కష్టమే. ఉదాహరణకు ఒవేరియన్, సెర్వికల్ క్యాన్సర్లను నిర్ధారించాలంటే ఎక్స్రేతో పాటు సీటీ స్కాన్ చేయాలి. ఈ పరీక్ష కడుపులోని పిండానికి హాని కలిగిస్తుంది. కాబట్టి, తాత్కాలికంగా పరీక్షలు వాయిదా వేస్తారు. ఫలితంగా వ్యాధిని గుర్తించడం ఆలస్యం కావచ్చు. పరీక్షల్లో ఒవేరియన్, సెర్వికల్, ఈనస్, కోలన్ క్యాన్సర్లు నిర్ధారణ అయితే.. తక్షణం గైనకాలజిస్ట్, ఆబ్ట్సెట్రీషియన్, ఆంకాలజిస్ట్, రోగి, ఆమె కుటుంబ సభ్యులు కూర్చుని తదుపరి వైద్యానికి సంబంధించి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. క్యాన్సర్ ఏ దశలో ఉంది? గర్భం ఏ త్రైమాసికంలో ఉంది? కాన్పు తర్వాత క్యాన్సర్ చికిత్స మొదలు పెట్టొచ్చా? మరీ అంత ఆలస్యం అయితే క్యాన్సర్ వ్యాపించే ఆస్కారం ఉందా? తప్పనిసరైతే అబార్షన్కు వెళ్లాలా?.. తదితర అంశాలు చర్చించుకున్నాకే ముందడుగు వేయాలి. ఒక్కసారి అది క్యాన్సరే అని ధ్రువీకరిస్తే మాత్రం.. ఆ మహిళ తక్షణ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఈ దశలో కుటుంబ సభ్యుల తోడ్పాటు, ఓదార్పు చాలా అవసరం.
బిడ్డపై ప్రభావం..
తల్లికి ఉన్న క్యాన్సర్ కడుపులో బిడ్డకు సోకే ఆస్కారమే లేదు. కాకపోతే, క్యాన్సర్ చికిత్సా పద్ధతులవల్ల పిండానికి ఎంతోకొంత హాని జరగొచ్చు. ముఖ్యంగా రేడియేషన్ ఏమాత్రం మంచిది కాదు. మొదటి త్రైమాసికంలోనే క్యాన్సర్ నిర్ధారణ జరిగితే, కీమో థెరపీని కొన్నిరోజులు ఆపేసి.. రెండు, మూడు త్రైమాసికాల్లో చేపడతారు. సర్జరీ మాత్రం మొదటి త్రైమాసికంలోనూ చేయవచ్చు. రెండు, మూడు త్రైమాసికాల్లో గుర్తిస్తే మాత్రం.. క్యాన్సర్, దాని పరిమాణం, ప్రస్తుత దశ బేరీజు వేసి వెంటనే చికిత్స ప్రారంభించాలా, కాన్పు వరకూ వాయిదా వేయాలా అన్నది వైద్య బృందం నిర్ణయిస్తుంది. చికిత్స దశలో బిడ్డకు ప్రమాదం ఉందనిపిస్తే, పిండాన్ని స్థానభ్రంశం చేస్తారు. అంటే, చికిత్స జరుగుతున్న వైపు నుంచి కొంత పక్కకు జరుపుతారు. సాధారణ కాన్పు జరిగాకే, క్యాన్సర్ చికిత్స మొదలుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ క్యాన్సర్ వేగంగా విస్తరిస్తున్నట్టు అనిపిస్తే.. ప్రెగ్నెన్సీ వారాలు లెక్కేసి సిజేరియన్ చేసి బిడ్డను తీయాల్సి వస్తుంది. క్యాన్సర్ చికిత్స
తీసుకుంటున్న వాళ్లయినా, చికిత్స వాయిదాపడిన వాళ్లయినా బిడ్డకు తల్లిపాలు పట్టకూడదు.
అండాలను దాచిపెట్టి..
మారుతున్న సాంకేతికత కొత్తకొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నది. అందులో ఒకటి.. ఎగ్ ఫ్రీజింగ్ (మెచ్యూర్ ఊసైట్ క్రయోప్రిజర్వేషన్). పెండ్లికి ముందైనా, తర్వాత అయినా.. అప్పుడే పిల్లలు వద్దనుకున్న మహిళలు తమ ఆరోగ్యకర అండాలను దాచిపెట్టుకోవచ్చు. అలాగే క్యాన్సర్ నిర్ధారణ తర్వాత, కొన్ని నెలలు అండాలను తీసి ఫ్రీజ్ చేసుకున్నాక.. కీమో థెరపీకి వెళ్లొచ్చు. ఎందుకంటే చాలా కేసుల్లో క్యాన్సర్ చికిత్స వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గవచ్చు. మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లో సమస్యలు ఎదురుకావచ్చు. గర్భాశయ క్యాన్సర్ విషయంలో అయితే, గర్భాశయాన్ని పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. వంశ పారంపర్యంగా కూడా ఈ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి, ఎలా చూసుకున్నా ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఎవరికైనా శ్రేయస్కరమే. పిల్లలు కావాలనుకున్నప్పుడు ఈ అండాలను ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా, టెస్ట్ట్యూబ్లో పిండం తయారయ్యాక దాన్ని గర్భాశయంలోకి కూడా పంపుకోవచ్చు. కాబట్టి, క్యాన్సర్ కారణంగా మాతృత్వాన్ని దూరం చేసుకుంటామన్న భయం అవసరం లేదు. గర్భిణులే కాదు, ప్రతి మహిళా తరచూ క్యాన్సర్ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
నిఖిత నెల్లుట్ల
డాక్టర్ మంజులా అనగాని
క్లినికల్ డైరెక్టర్
డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ
కేర్ హాస్పిటల్స్